- అండగా ఉంటాం.. మద్దతివ్వండి!
- ఓట్ల వేటలో ప్రధాన పార్టీల అభ్యర్థులు
- జనాలకు చేరువయ్యేలా ఆత్మీయ సమ్మేళనాలు
- కుల, కాలనీ, సంక్షేమ సంఘాలతో భేటీలు
- ఓటర్లను తమవైపుతిప్పుకునేలా హామీలు
- నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్లు
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో లీడర్లు ప్రచారంపై ఫోకస్ పెట్టారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూకుడు పెంచారు. ఇప్పటికే టికెట్ కన్ఫర్మ్ అయిన నేతలతో పాటు ఆశావహులు కూడా కుల, కాలనీ, సంక్షేమ, యువ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ముషీరాబాద్, సనత్నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, మేడ్చల్, మహేశ్వరం, రాజేంద్రనగర్, గోషామహల్ తదితర స్థానాల్లో సమావేశాలు, హెల్త్ క్యాంప్లు కొనసాగిస్తున్నారు.
అన్ని పార్టీల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు కిందిస్థాయిలో యాక్టివ్ నేతలు సరికొత్త హామీలతో సామాజిక వర్గాలవారీగా ఓటర్లను తమవైపు తిప్పుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. గెలిచేది తామేనంటూ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తూ సంఘాల నేతల్లో భరోసా నింపుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సిటీలో అన్ని కులాలకు భవనాలు నిర్మిస్తుందని, అన్ని వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆత్మీయ సమ్మేళనాల్లో హామీ ఇస్తున్నారు.
కులపెద్దలతో డీల్..
ప్రధాన పార్టీల నేతలంతా తమ సెగ్మెంట్లలో పలుకుబడి ఉన్న సంఘ పెద్దల జాబితాను సిద్ధం చేసుకొని, వారితో టచ్లో ఉంటున్నారు. కీలకమైన నేతలతో భేటీ అవుతూ మద్దతుగా నిలువాలని కోరుతున్నారు. కుల పెద్దల వ్యక్తిగత సమస్యలతో పాటు సంఘాలకు కావాల్సిన అవసరాలను ముందుగానే అడిగి తెలుసుకుంటున్నారు. అయితే.. కుల పెద్దలే లబ్ది పొందుతున్నారనే విమర్శలతో అక్కడక్కడ చిన్నపాటి ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికార బీఆర్ఎస్నేతలు అసంతృప్తులను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికల నాటికి పెద్దగా ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పటికే అన్నిపార్టీల నేతలు కుల సంఘాల వివరాలు సేకరించినట్లు సమాచారం.
సర్కార్ పథకాలపైనే..
ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందన్న సమాచారాన్ని బీఆర్ఎస్ అధిష్టానం తెలుసుకుంటున్నది. ప్రత్యర్థి పార్టీలకు గ్రేటర్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పసిగడుతూ కుల పెద్దలు చేజారిపోకుండా ముందస్తుగా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. కులాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలపై ముమ్మరంగా ప్రచారం చేస్తున్నది. ఇప్పటికే కొన్ని వర్గాల సంక్షేమానికి 9 ఏండ్లలో ప్రభుత్వం కృషి చేసిందని, భవిష్యత్లో మరిన్ని పథకాలకు రూపకల్పన చేస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దళితబంధు, బీసీ బంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో పాటు తదితర ప్రభుత్వ పథకాలు తెలిపేందుకు అధికార పార్టీ నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు చిన్నగా నిర్వహించే ప్రోగ్రామ్లు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.
ఉచితంగా మెడికల్ టెస్టులు..
కొన్ని కాలనీల్లో నేతలు జనాలకు ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్లు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల రెగ్యులర్గా నిర్వహించి మెడిసిన్స్ కూడా అందిస్తున్నారు. అవసరమైతే మెడికల్ టెస్టులు సైతం ఉచితంగా చేయిస్తున్నారు. ఎలాగైనా ఓటర్ల మదిలో ఉండాలని లీడర్లు పలు ప్రోగ్రామ్స్ చేపడుతున్నారు. గ్రేటర్లో 24 సెగ్మెంట్లు ఉండగా 10 చోట్ల ఇప్పటికే హెల్త్ క్యాంపులు జరిగాయి. ఒకరిని చూసి మరొకరు పోటాపోటీగా క్యాంప్లు నిర్వహిస్తున్నారు.