న్యూఢిల్లీ : టాప్ సిటీలలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఊపందుకుంది. ఈ ఏడాది జనవరి– మార్చి మధ్య దేశంలోని టాప్ 8 సిటీల్లో నికరంగా 44 శాతం గ్రోత్ నమోదు చేసింది. కానీ, హైదరాబాద్లో మాత్రం కొద్దిగా తగ్గింది. ఈ ఏడాది మార్చి క్వార్టర్లో హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ నికరంగా 16.06 లక్షల చదరపు అడుగులుగా రికార్డయ్యింది. ఇది కిందటేడాది జనవరి–మార్చి క్వార్టర్లో నమోదైన 16.40 లక్షలతో పోలిస్తే 2 శాతం తక్కువ.
కార్పొరేట్ కంపెనీలు తమ ఆఫీసులను విస్తరిస్తుండడంతో డిమాండ్ పెరుగుతోందని కుష్మన్ వేక్ఫీల్డ్ రిపోర్ట్ పేర్కొంది. ఈ ఏడాది జనవరి –మార్చి క్వార్టర్లో టాప్ 8 సిటీలలో నికరంగా 1.15 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ను డెవలపర్లు లీజుకు ఇచ్చారని, కిందటేడాది జనవరి–మార్చి క్వార్టర్లో ఇచ్చిన 80.09 లక్షల చదరపు అడుగులతో పోలిస్తే ఇది ఎక్కువని వివరించింది. ‘గత ఐదేళ్లలో ఇది మూడో హయ్యెస్ట్ లెవెల్. ఆఫీస్ స్పేస్లకు ఉన్న డిమాండ్కు ఇది నిదర్శనం’ అని కుష్మన్ వేక్ఫీల్డ్ పేర్కొంది.
ఈ ఏడాది మార్చి క్వార్టర్లో బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, చెన్నైలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ పెరగగా, పూణె, హైదరాబాద్, కోల్కతా, అహ్మదాబాద్లో తగ్గింది. ఇండియన్ ఆఫీస్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని, వరుసగా రెండు క్వార్టర్లలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ గ్రాస్ లెవెల్లో 2 కోట్ల చదరపు అడుగులను టచ్ చేసిందని కుష్మన్ వేక్ఫీల్డ్ తెలిపింది.