న్యూఢిల్లీ : ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో బ్యాంకింగ్ రంగం సత్తా చాటే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీలు) మొత్తం లాభం పెరగడంతోపాటు మొండి బకాయిలు మరింత తగ్గుతాయని ఎక్స్పర్టులు చెబుతున్నారు. క్రెడిట్గ్రోత్ కూడా మరింత పెరుగుతుందని అంటున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో వీటి లాభం రికార్డు స్థాయిలో రూ. లక్ష కోట్లకు చేరుకుంటుందని అంచనా. స్టేట్ బ్యాంక్ మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 40 వేల కోట్లకుపైగా ఎక్కువ లాభాన్ని ఆర్జించవచ్చని సంస్థ సీనియర్ ఆఫీసర్ ఒకరు అన్నారు. 2022 ఆర్థిక సంవత్సరంలో ఇదేకాలంలో రూ. 31,675.98 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా భారీ సంఖ్యలను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్పీఏలు తగ్గుదల, స్లిపేజ్లు కంట్రోల్లో ఉండటం, క్రెడిట్ గ్రోత్ రెండంకెలు దాటడం, పెరుగుతున్న వడ్డీ రేట్లు ఇందుకు కారణాలు. 2022–-23 మొదటి తొమ్మిది నెలలకు, మొత్తం 12 పీఎస్బీలు రూ. 70,166 కోట్ల లాభాన్ని ఆర్జించాయి. ఇది కిందటి సంవత్సరంతో పోలిస్తే 43 శాతం పెరిగింది. పీఎస్బీలు నాలుగో క్వార్టర్లో రూ. 30 వేల కోట్లు ఆర్జించే అవకాశం ఉంది.
పీఎన్బీకి మాత్రమే నష్టం...
పీఎస్బీలు మొదటి క్వార్టర్లో దాదాపు రూ.15,306 కోట్ల లాభాన్ని ఆర్జించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మినహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు డిసెంబర్– మార్చి క్వార్టర్లో లాభాలను పెంచుకున్నాయి. ఎస్బీఐ అత్యధికంగా 68 శాతం గ్రోత్తో రూ.14,205 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. పెరుగుతున్న డిపాజిట్ రేట్లు, ‘కాసా’ అకౌంట్ల తగ్గుదల కారణంగా అన్ని బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్ తగ్గొచ్చని సాహా చెప్పారు. ఆర్బీఎల్, ఇండస్ఇండ్బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా బలమైన లాభదాయకతను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సిటీ బ్యాంక్ పోర్ట్ఫోలియో కొనుగోలు వల్ల యాక్సిస్ బ్యాంక్కు ఈసారి నష్టాలు ఎదురుకావొచ్చు. మూడో క్వార్టర్లో ప్రైవేట్ బ్యాంకులు లాభాలు వార్షికంగా 33 శాతం పెరిగి రూ.36,512 కోట్లకు చేరుకున్నాయి. బంధన్ బ్యాంక్, యెస్ బ్యాంక్ మినహా అన్ని ప్రైవేట్ బ్యాంకులు క్యూ3లో నికర లాభాలను పెంచుకున్నాయి.