హైదరాబాద్, వెలుగు: ఒకసారి పెట్టుబడి పెట్టి, ఏళ్లపాటు ఆదాయం, భద్రత పొందే కొత్త పాలసీని ఎల్ఐసీ తీసుకొచ్చింది. జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం ప్లాన్లో పాలసీదారుడు ఒకసారి ప్రీమియం చెల్లించిన తర్వాత, నిర్దిష్ట కాలం వరకు ఏటా గ్యారంటీడ్ యాడిషన్లు ఉంటాయి. అంటే ప్రతీ రూ.1000 బేసిక్ సమ్ అష్యూర్డ్కి రూ.40 గ్యారెంటీడ్ యాడిషన్ ఉంటుంది. దీంతో పాలసీ విలువ పెరుగుతుంది. ఈ ప్లాన్ కింద కనీసం రూ.5 లక్షల బేసిస్ సమ్ అష్యూర్డ్ని ఎల్ఐసీ అందిస్తోంది.
ఈ ప్లాన్లో రెండు రకాల ఆదాయ ప్రయోజనాలు
ఒకటి రెగ్యులర్ ఇన్కమ్. పాలసీ తీసుకున్న 7 నుంచి 17 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం తన బేసిక్ సమ్ అష్యూర్డ్లో 10 శాతం అమౌంట్ను పాలసీ హోల్డర్ పొందుతారు. రెండోది ఫ్లెక్సీ ఇన్కమ్. ఈ ఆప్షన్ ఎంచుకున్న పాలసీ హోల్డరు తమ ఆదాయాన్ని విత్డ్రా చేసుకోరు. ఫలితంగా ఎల్ఐసీ ఈ అమౌంట్పై ఏడాదికి 5.5 శాతం వడ్డీ చెల్లిస్తుంది.
పాలసీదారుడు మరణించినప్పుడు, బేసిక్ సమ్ అష్యూర్డ్ లేదా 1.25 రెట్లు టాబ్యులర్ సింగిల్ ప్రీమియం (వీటిలో ఏది ఎక్కువైతే అది), అలాగే చేరిన గ్యారంటీడ్ యాడిషన్ల మొత్తాన్ని నామినీలకు చెల్లిస్తారు. పాలసీ కాలం పూర్తయ్యే వరకు జీవించి ఉంటే, మెచ్యూరిటీ మొత్తం లభిస్తుంది. ఈ ప్లాన్లో లోన్ సౌకర్యం, అధిక సమ్ అష్యూర్డ్ రిబేట్, డిజబిలిటీ రైడర్, న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్ వంటి అదనపు రక్షణలు కూడా ఉన్నాయని ఎల్ఐసీ తెలియజేసింది.
