
న్యూఢిల్లీ: ఫిన్టెక్ సెక్టార్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఎల్ఐసీ చూస్తోంది. బిజినెస్లను డిజిటలైజ్ చేస్తున్న కంపెనీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ డైవ్ (డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్హ్యాన్స్మెంట్) ను స్టార్ట్ చేసింది. దీన్ని చూసుకునేందుకు ఓ కన్సల్టెంట్ను నియమించింది. కస్టమర్లకు వరల్డ్ క్లాస్ డిజిటల్ సర్వీస్లను అందించడమే తమ టార్గెట్ అని ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్ధ మొహంతి అన్నారు.
డైవ్ ప్రాజెక్ట్లో భాగంగా మొదట కస్టమర్లను పొందడంలో డిజిటల్ బాట పడతామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏజెంట్లు, బ్యాంకష్యూరన్స్ (బ్యాంకులు పాలసీలు అమ్మడం), డైరెక్ట్ సేల్.. ఇలా మూడు విధానాల్లో కస్టమర్లకు పాలసీలు అమ్ముతున్నామని ఆయన వివరించారు. ఏజెంట్ల ద్వారా ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించగలుగుతున్నామని, ఇతర విధానాలను కూడా డిజిటలైజ్ చేస్తామని అన్నారు. వీటితో పాటు క్లయిమ్ సెటిల్మెంట్, లోన్, ఇతర సర్వీస్లు కూడా ఆన్లైన్లో అందుబాటులోకి తెస్తామని, కేవలం ఒక్క క్లిక్తోనే కస్టమర్లు ఈ సర్వీస్లు పొందొచ్చని వెల్లడించారు.
‘కస్టమర్లు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదు. ఇంటిలో కూర్చొనే తమ మొబైల్ ద్వారా అవసరమైన సర్వీస్లు పొందొచ్చు. వ్యాపారాన్ని విస్తరించడంలో భాగంగా ఫిన్టెక్ బిజినెస్పై కూడా ఫోకస్ పెడుతున్నాం’ అని మొహంతి వివరించారు. సొంతంగా ఓ ఫిన్టెక్ కంపెనీని ఏర్పాటు చేయాలని కూడా ఎల్ఐసీ ప్లాన్ చేస్తోంది. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నామని, ఈ అంశంపై ఇప్పుడేం మాట్లాడలేనని పేర్కొన్నారు. కాగా, ఎల్ఐసీ తమ పాలసీలను అమ్మడానికి మూడు ఫిన్టెక్ కంపెనీలతో జాయిన్ అయ్యింది. ఇవి కంపెనీకి కార్పొరేట్ ఏజెంట్లుగా పనిచేస్తున్నాయి.