లిస్టులో మారుతి, పవర్ గ్రిడ్ టాప్
న్యూఢిల్లీ: అతిపెద్ద డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ (డీఐఐ) అయిన ఎల్ఐసీ ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో 105 షేర్లలో తమ ఇన్వెస్ట్మెంట్లను తగ్గించుకుంది. రూ.20 వేల కోట్ల విలువైన 10 కంపెనీల షేర్లను కంపెనీ సేల్ చేసింది. ఈ లిస్టులో మారుతి సుజుకీ ఇండియా టాప్లో ఉంది. ఎల్ఐసీ 43.2 లక్షల మారుతి సుజుకీ షేర్లను క్యూ2 లో అమ్మింది. కంపెనీలో తన వాటాను జూన్ క్వార్టర్లో నమోదైన 4.86 శాతం నుంచి 3.43 శాతానికి తగ్గించుకుంది. ఈ షేర్ల విలువ నికరంగా రూ.3,814 కోట్లుగా ఉందని ప్రైమ్ డేటాబేస్ పేర్కొంది. సెమికండక్టర్ల కొరత తీరడంతో గత ఆరు నెలల్లో మారుతి షేర్లు 26 శాతం పెరిగాయి. ప్రభుత్వ రంగ కంపెనీ పవర్ గ్రిడ్ షేర్లను కూడా పెద్ద మొత్తంలోనే ఎల్ఐసీ అమ్మింది.
క్యూ2 లో రూ. 2,452 కోట్ల విలువైన షేర్లను కంపెనీ సేల్ చేసింది. పవర్ గ్రిడ్లో తన వాటాను 9.97 శాతం నుంచి 8.61 శాతానికి (క్వార్టర్లీ పరంగా) తగ్గించుకుంది. రూ.2,356 కోట్ల విలువైన సన్ ఫార్మా షేర్లను, రూ.2,066 కోట్ల విలువైన ఎన్టీపీసీ షేర్లను, రూ.2,030 కోట్ల విలువైన హిందుస్తాన్ యూనిలీవర్ షేర్లను ఎల్ఐసీ క్యూ2 లో అమ్మింది. రూ.1,940 కోట్ల విలువైన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) షేర్లను, రూ. 1,482 కోట్ల అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లను, రూ.1,435 కోట్ల సీమన్స్ షేర్లను, రూ.1,235 కోట్ల విలువైన బ్రిటానియా షేర్లను, రూ.1,005 కోట్ల విలువైన బజాజ్ ఆటో షేర్లను సేల్ చేసింది.
ఈ సెక్టార్ల పనితీరు మెరుగ్గానే..
సెప్టెంబర్తో ముగిసిన క్వార్టర్లో బ్యాంకింగ్, ఆటో సెక్టార్ మంచి పనితీరు కనబరిచాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఫార్మా, ఎఫ్ఎంసీజీ సెక్టార్లు కొద్దిగా వెనకబడ్డాయని వివరించారు. ఎకానమీ గ్రోత్పై ఎక్కువగా ఆధారపడే బిజినెస్లు షార్ట్ టర్మ్లో వెనకబడతాయని ఫిస్డమ్ రీసెర్చ్ ఓ రిపోర్ట్లో పేర్కొంది. మార్కెట్ షేరు ఎక్కువగా ఉన్న కంపెనీలు, ధరలను నిర్ణయించగలిగే కంపెనీల పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుందని తెలిపింది. లోకల్ డిమాండ్పై ఆధారపడే కంపెనీలు, ఇన్పుట్ కాస్ట్ను కన్జూమర్లకు ట్రాన్స్ఫర్ చేయగలిగే కంపెనీల పెర్పార్మెన్స్ బాగానే ఉంటుందని అంచనావేసింది. వాల్యుయేషన్స్ పరంగా ఫైనాన్షియల్స్కు ఓవర్ వెయిట్ రేటింగ్ను, హెల్త్కేర్ సెక్టార్కు అండర్వెయిట్ రేటింగ్ను మోర్గాన్ స్టాన్లీ ఇచ్చింది.