భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు

భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు
  • శిక్ష విధించిన రంగారెడ్డి జిల్లా 9వ అడిషనల్ కోర్టు

గచ్చిబౌలి, వెలుగు: భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా 9వ అడిషనల్ కోర్టు తీర్పునిచ్చింది. సైబరాబాద్ పోలీసులు తెలిపిన  ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి గ్రామానికి చెందిన జంగయ్యకు అదే ఊరికి చెందిన లావణ్య(25)తో 2016లో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు. జంగయ్య ఫొటోగ్రాఫర్ గా పనిచేసేవాడు.

అతడికి మరో మహిళతో వివాహేతర సంబంధంఉండటంతో భార్యను తరచూ వేధించేవాడు. లావణ్య తల్లిదండ్రులకు విషయం చెప్పగా.. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించి పద్ధతి మార్చుకోవాలని జంగయ్యకు చెప్పారు. భార్య తనకు అడ్డుగా ఉందని భావించిన జంగయ్య ఆమెను చంపేందుకు స్కెచ్ వేశాడు. 2021 డిసెంబర్​17న రాత్రి 11 గంటలకు లావణ్యపై దాడి చేశాడు.

ఆమె తలను నేలకు బాది చంపేశాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు జంగయ్యను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రంగారెడ్డి జిల్లా 9వ అడిషనల్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సోమవారం కేసు విచారణకు రాగా.. జంగయ్యకు జీవిత ఖైదుతో పాటు రూ.20 వేల ఫైన్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.