రాష్ట్రంలో లిక్కర్ కేవలం సర్కారుకు మాత్రమే కాకుండా కొన్నిసార్లు లీడర్లకు కూడా ఆదాయ వనరుగా పనికొస్తున్నది. పైగా ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కావడంతో కొందరు నాయకులు వైన్స్ యజమానుల నుంచి వసూళ్లకు సిద్ధమయ్యారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2,620 వైన్స్లకు లక్కీ డ్రా తీసి టెండర్లు ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. ఒక్కో అప్లికేషన్కు రూ.2 లక్షల చొప్పున నాలుగైదు అప్లికేషన్లు వేసి టెండర్ దక్కించుకుంటే.. అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిందని షాపులు దక్కించుకున్న యజమానులు వాపోతున్నారు. ‘టెండర్ ఫీజు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేశాం.. ఇంకేముంది డిసెంబర్ ఒకటో తేదీ నుంచి షాపులు ఓపెన్ చేసుకోవడమే’ అని అనుకుంటుంటే.. స్థానిక ఎక్సైజ్ సీఐల నుంచి వసూళ్లు మొదలయ్యాయి. ‘అదేంటి ఇంకా షాపులు మా చేతికి కూడా రాలేదు. అప్పుడే డబ్బులు ఎందుకివ్వాలి’ అని అడిగితే.. ‘పై నుంచి ఆర్డర్ వచ్చింది. మంత్రికి, ఎమ్మెల్యేలకు వాటా పంపాలి. ఎన్నికల ఖర్చులకు మీ సహకారం ఉంటేనే.. భవిష్యత్లో షాపులు సాఫీగా నడుపుకుంటారని’ సున్నితంగా హెచ్చరిస్తున్నారు
రూ.65 కోట్లు టార్గెట్
కొత్త వైన్స్దక్కించుకున్న వారి నుంచి మొత్తం రూ.65 కోట్లు వసూలు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్టు సమాచారం. ఎక్సైజ్ అధికారులే ఈ వసూళ్ల బాధ్యతను నెత్తిన పెట్టుకున్నట్లు తెలిసింది. ఇందులో వారికీ కొంత వాటా ఉందని ఆ శాఖలో ప్రచారం జరుగుతున్నది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా వైన్స్లు దక్కించుకున్నోళ్లందరి నుంచి రూ.2.5 లక్షల చొప్పున అడుగుతున్నారని.. టెండర్ల ఫీజు కంటే.. వీళ్ల వసూళ్లే ఎక్కువగా ఉన్నాయని షాపులయజమానులు చర్చించుకుంటున్నారు. ఇవ్వకపోతే ఒక బాధ.. ఇవ్వాలంటే ఇంకో బాధ అన్న చందంగా తమ పరిస్థితి మారిదంటున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడే కాదు.. ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు ఎలక్షన్లలో అవసరమైన ఖర్చులకూ వైన్స్లే దిక్కయ్యాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలక్షన్ షెడ్యూల్వచ్చేలోపు రెండున్నర లక్షలు వసూలు చేసి ఇవ్వాల్సిందేనని మంత్రుల నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని ఆఫీసర్లు చెప్పుకుంటున్నారు. డబ్బులు ఇవ్వనివారి లిస్ట్ను కూడా రెడీ చేసి పెట్టుకుంటామని అధికారుల నుంచి సంకేతాలు పంపుతుండడంతో.. ఎలక్షన్లలో సేల్స్ పెరిగి లాభమైతదని అనుకుంటే.. తమ నుంచే ఎన్నికలకు ఖర్చు పేరుతో తీసుకోవడంపై షాపులయజమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
‑ హైదరాబాద్, వెలుగు