యాదాద్రి, వెలుగు : వైన్స్ లను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్న నలుగురిని యాదాద్రి జిల్లా తుర్కపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ రాజేశ్చంద్ర కథనం ప్రకారం...కామారెడ్డికి చెందిన పిన్నోజు రవి గతంలో వైన్స్ లో చోరీలు చేసేవాడు. కరీంనగర్ జైలులో ఉండగా ఓ చోరీ కేసులో శిక్ష అనుభవిస్తున్న మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలం గాగిల్లాపూర్కు చెందిన హరీశ్తో పరిచయమైంది.
బెయిల్పై బయటకు వచ్చాక ఇద్దరూ కలిసి రాజాపేట వద్ద ఒక వైన్ షాపులో చోరీ చేసి నల్గొండ జైలుకు వెళ్లారు. విడుదలైన తర్వాత మోత్కూర్ మండలం ముసిపట్లకు చెందిన శాకాపురం నవీన్, సిద్దిపేటకు చెందిన చెప్యాల నర్సింహులును కలుపుకున్నారు. నలుగురు కలిసి ఈ నెల 24న తుర్కపల్లిలో వైన్స్ షట్టర్ తొలగించి రూ. 3,45,600 నగదు, రూ. 2 వేల విలువైన 8 మద్యం బాటిల్స్ అపహరించారు. వైన్స్ వద్ద సీసీ కెమెరాల్లో దొంగతనం రికార్డు కావడంతో పుటేజీల ఆధారంగా పోలీసులు గాలించారు. నిందితులు టూ వీలర్లపై వెళ్తూ వాసాలమర్రి వద్ద కనిపించగా అదుపులోకి తీసుకున్నారు. రెండు బైక్లు , రూ. 2, 04, 000 లక్షల నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు పంపించినట్లు డీసీపీ తెలిపారు. అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, యాదాద్రి ఏసీపీ రమేశ్కుమార్, యాదగిరిగుట్ట రూరల్ సీఐ కొండల్ రావు, తుర్కపల్లి ఎస్ఐ తక్యోద్దీన్, సిబ్బంది శ్రీనివాస్, సత్యనారాయణ, ప్రదీప్ కుమార్, రవి నాయక్, నిరంజన్ శివకుమార్ ఉన్నారు.