వైన్స్లో మద్యం చోరీ.. బెల్ట్షాప్లో అమ్మకాలు..ఆరుగురు నిందితుల అరెస్ట్

 వైన్స్లో మద్యం చోరీ.. బెల్ట్షాప్లో అమ్మకాలు..ఆరుగురు నిందితుల అరెస్ట్
  • వారిలో ఒకరు బెల్ట్​ షాప్​ నిర్వాహకుడు

భైంసా, వెలుగు: నిర్మల్​ జిల్లా ముథోల్, తానూర్​మండలాల్లోని రెండు వైన్స్​ల్లో దొంగతనం చేసిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపినట్లు భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమార్​ తెలిపారు. శనివారం భైంసాలో మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. మే నెల 24న అర్ధరాత్రి ముథోల్​లోని శ్రీరాజరాజేశ్వర వైన్స్​లో దొంగతనం జరిగింది. గత నెల 22న రాత్రి తానూర్​లోని శ్రీ లక్ష్మి వైన్స్​లోనూ చోరీ జరిగింది. 

ఈ చోరీ కేసులను ఛేదించేందుకు ముథోల్​ సీఐ మల్లేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలు, టెక్నికల్​ సహాయంతో నిందితులను గుర్తించినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. నిజామాబాద్​ జిల్లా రేంజల్ మండలం తాడ్​బి లోలి గ్రామానికి చెందిన వినోద్, బ్యాగరి రోహిత్, నీరడి శ్రావణ్ ​కుమార్, సాయి ఆదిత్య గౌడ్, నవీన్, దిలీప్​ కలిసి ఓ ముఠాగా ఏర్పడి ఈ దొంగతనాలు చేసినట్లు గుర్తించారు. వినోద్ ​గ్రామంలో బెల్టు షాపు నిర్వహిస్తుండగా.. మిగతా ఐదుగురు నిత్యం మద్యం తాగేందుకు అక్కడికి వెళ్లేవారు. రెండు బృందాలుగా ఏర్పడి వైన్స్​ల్లో చోరీలకు పాల్పడ్డారు.

 ముథోల్ ​వైన్స్​లో రూ.2.50 లక్షలు, తానూర్​ వైన్స్​లో రూ. 80 వేల మద్యం బాటిళ్లు చోరీ చేసి తీసుకెళ్లి వినోద్​కు అప్పగించగా.. తన బెల్టు షాపులో విక్రయించాడు. దొంగతనం చేసేందుకు ఈ ఆరుగురు మరోసారి ముథోల్​కు వచ్చారు. శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీల విషయాన్ని ఒప్పుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. వారి బ్యాంకు ఖాతాలను పరిశీలించి నగదును స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. సమావేశంలో సీఐ మల్లేశ్, ఎస్సైలు జుబేర్, బిట్ల పెర్సిస్​ పాల్గొన్నారు.