ముంబై: ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ముగిశాక మూడు రోజుల్లోనే ఆ కంపెనీ షేర్లు ఇకమీదట లిస్టవుతాయి. ప్రస్తుతం ఆరు రోజులుగా ఉన్న గడువును సగానికి తగ్గిస్తూ సెబీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల డిస్క్లోజర్ నిబంధనలను కొంత కఠినం చేయాలని కూడా డెసిషన్ తీసుకున్నారు.
ఫిన్ఫ్లుయెన్సర్లను కట్టడి చేస్తాం....
మార్కెట్లో పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ల (ఫిన్ఫ్లుయెన్సర్లు) బారి నుంచి చిన్న ఇన్వెస్టర్లను కాపాడేందుకు సెబీ నడుం కట్టింది. అన్రిజిస్టర్డ్ ఇన్ఫ్లుయెన్సర్ల ప్రోద్భలంతో డబ్బులు పోగొట్టుకోకుండా అడ్డుకట్ట వేసేందుకు చొరవ తీసుకోనుంది. ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ల కోసం రూల్స్, గైడ్లైన్స్ తేవాలని సెబీ నిర్ణయించినట్లు చైర్ పర్సన్ మాధబి పురి బుచ్ వెల్లడించారు. ఒకటి లేదా రెండు నెలల్లో ఇందుకోసం ఒక డిస్కషన్ పేపర్ తెస్తున్నామని చెప్పారు. కోట్లలో సంపాదించినా, పన్నులు కట్టకపోవడంతో 35 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కిందటి వారంలో ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు పంపించింది. అంతేకాదు, కేరళ రాష్ట్రంలో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న టాప్ 13 యూట్యూబర్లపై దాడులు కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో సెబీ చైర్ పర్సన్ మాధబి పురి బుచ్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ల నియంత్రణ కోసం నడుం బిగించామని, ఇందుకు డిస్కషన్ పేపర్ రెడీ చేస్తున్నామని బుచ్ వెల్లడించారు. బుధవారం రాత్రి సెబీ బోర్డు మీటింగ్ ముగిశాక ఆమె మీడియాతో మాట్లాడారు.
మానిప్యులేషన్తో ఇన్వెస్టర్లకు బురిడీ...
ఇన్వెస్టర్లలో అవగాహన పెంచే ప్రయత్నం ఎవరైనా చేస్తే సంతోషం కలిగించేదేనని, కానీ, అడక్కుండానే తమ వద్ద రిజిస్ట్రేషన్ పొందని కొంత మంది అడ్వైజర్ల అవతారాలు ఎత్తుతుండటం ఇబ్బందికరమైనదని మాధబి పురి బుచ్ స్పష్టం చేశారు. ఓ వైపు మార్కెట్ మానిప్యులేషన్కు పాల్పడుతూ, మరోవైపు అమాయక ఇన్వెస్టర్లకు ఎక్కువ లాభాలు ఆశచూపిస్తూ గేలం వేయడం క్షమించరానిదని పేర్కొన్నారు. తాము సలహాలిచ్చే ప్లాట్ఫామ్స్ నుంచి కమిషన్ల రూపంలోనూ, ఆయా షేర్లలో కొనుగోళ్లు–అమ్మకాల ద్వారా లాభాల రూపంలోనూ కొంత మంది ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బులు దండుకుంటున్నారని బుచ్ వివరించారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రాం, వాట్సాప్, ట్విట్టర్ ప్లాట్ఫామ్ల ద్వారా సలహాలిచ్చే ఫిన్ఫ్లుయెన్సర్ల సంఖ్య బాగా పెరిగిపోయిందని చెప్పారు. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని చిన్న ఇన్వెస్టర్లను సెబీ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉందని పేర్కొన్నారు. మరో వైపు కొంత మంది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లుగా సెబీ వద్ద గుర్తింపు పొంది, ఆ గుర్తింపును చూపించి అక్రమంగా ప్రయోజనాలు పొందే ప్రయత్నాలను చేస్తున్నట్లు బుచ్ వెల్లడించారు. ఇలాంటి వారిపైనా నియంత్రణలు తప్పనిసరని చెప్పారు.
వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ల మూసివేత..
మార్కెట్ కదలికలపై డేటాను లీక్ చేస్తున్న కొన్ని వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్లు మూతపడేలా సెబీ ఇప్పటికే చొరవ తీసుకుంది. అలాంటి గ్రూప్ల కారణంగా చాలా లిస్టెడ్ కంపెనీలు తమ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ప్రకటన కోసం మార్కెట్ నడవని వారాంతాలనే ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని సెబీ వివరిస్తోంది. అంతేకాదని, మీడియాతో మాట్లాడటం కూడా చాలా కంపెనీలు మానుకుంటున్నాయని పేర్కొంటోంది. ఈ ఏడాది మార్చి నెలలో కొంత మంది యూట్యూబర్లు, 44 సంస్థలను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి సెబీ నిషేధించింది. షేర్ల ధరలను మానిప్యులేట్ చేయడం ద్వారా అక్రమ లాభాలు గడిస్తున్నారనే కారణంగానే వారిపై చర్యలు తీసుకుంది. ఈ ఏడాది మే నెలలో మరి కొంత మంది ఇన్ఫ్లుయెన్సర్లపై కోట్ల రూపాయలు పెనాల్టీ విధించడంతో పాటు, మార్కెట్ కార్యకలాపాలు నిర్వహించకుండా కట్టడి చేస్తూ చర్యలు తీసుకుంది.