
- జనాభా ప్రాతిపదికన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు
- విలీన పంచాయతీలపై ఎలా ముందుకెళ్లాలన్నదానిపై సమాలోచనలు
- పంచాయతీ పోరుకు ఏర్పాట్లను ముమ్మరం చేసిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఏప్రిల్, మే నెలలో ఎన్నికలు జరుగుతాయని భావించినా.. పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. పాలకవర్గాలు లేక కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయి పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడటంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. ఈ క్రమంలో ఎన్నికలకు సిద్ధం కావాలని పంచాయతీరాజ్అధికారులకు సర్కార్ నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఇటీవల సీఎస్ రామకృష్ణారావు, పంచాయతీరాజ్ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పంచాయతీల పరిస్థితి, స్థానిక ఎన్నికల సన్నద్ధతపై చర్చ జరిగినట్లు సమాచారం.
తాజా పరిస్థితులను బట్టి జూన్ చివర్లో గానీ, జులై మొదట్లోగానీ పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్న ఆదేశాల మేరకు ఇటు పంచాయతీరాజ్శాఖ, అటు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఈ సారి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్ల కేటాయింపు బాధ్యతలను సర్కారు బీసీ డెడికేటెడ్ కమిషన్కు అప్పగించింది. గతంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్డీవోలు రిజర్వేషన్లు ఖరారు చేసేవారు. తొలిసారిగా డెడికేటెడ్ కమిషన్ కు రిజర్వేషన్ల బాధ్యతను అప్పగించగా.. ఇప్పటికే గ్రామాలు, మండలాలవారీగా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలిసింది. కాగా, వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియను ఆర్డీవోలు, ఎంపీడీవోలు చేపట్టనున్నారు.
వార్డు రిజర్వేషన్లు ఖరారు చేయనున్న ఆర్డీవోలు, ఎంపీడీవోలు గ్రామాల్లో వార్డు ఎన్నికలు కూడా కీలకం కానున్నాయి. పార్టీలవారీగా గెలుపు కోసం పోటీ పడుతుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వార్డు రిజర్వేషన్ల బాధ్యతలను ఆర్డీవోలు, ఎంపీడీలకు అప్పగించింది. రాష్ట్రంలో 1,12,680 వార్డులు ఉండగా.. ఆయా గ్రామాల్లో ఉన్న జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు తెలిసింది.
73 గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం
తెలంగాణలో 12,848 గ్రామాలు ఉండగా ప్రస్తుతం వార్డులు 1,12,680, ఎంపీటీసీ స్థానాలు 5,307 ఉన్నాయి. మున్సిపాలిటీల విస్తీరణలో భాగంగా 73 గ్రామాలను విలీనం చేశారు. దీంతో 12,775 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు 570 ఎంపీపీ స్థానాలు ఉండగా.. 567 మండలాలకు మాత్రమే ఎంపీపీలను ఎన్నుకోనున్నారు. ఎంపీపీ స్థానాల సంఖ్య ఎంతో జడ్పీటీసీల స్థానాల సంఖ్య అంతే ఉంటుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 32 జడ్పీ చైర్మన్ స్థానాలుండగా మేడ్చల్ జిల్లాలోని గ్రామాలన్నీ సిటీలో కలవడంతో ఒక జడ్పీ చైర్మన్ స్థానం తగ్గిపోనున్నది. 31 జడ్పీ చైర్మన్లను మాత్రమే ఎన్నుకోనున్నారు. రాష్ట్రంలో 73 గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం కావడంతో ఈ గ్రామాలను లోకల్ బాడీ ఎన్నికల జాబితా నుంచి తొలగించారు. ములుగు, కల్లూరు, బిచ్కుంద, అలియాబాద్, రామగుండం, పెద్ద అంబర్పేట, చేవెళ్ల, మొయినాబాద్, కొత్తగూడెం, అమీన్పూర్, మద్దూరుతోపాటు పలు మున్సిపాలిటీల్లో పలు గ్రామాలు విలీనం కావడంతో మున్సిపాలిటీల పాలనలోకి వెళ్లాయి. ఈ గ్రామాల విలీనంతో ఆయా మండలాల్లోని కొన్ని గ్రామాలు కొంత డిస్ట్రబ్ అయ్యాయి. ఎంపీటీసీ ఎన్నికలకు ఇది అవరోధంగా మారనున్నది. ఈ గ్రామాల్లో ఎన్నికల విషయంలో ఎలా ముందుకెళ్లాలనేదానిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.
పల్లెపోరుకు సర్వం సిద్ధం
పంచాయతీలకు ఎన్నికలకు పంచాయతీరాజ్ సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే ఓటరు జాబితా, వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాల గుర్తింపుతోపాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్యాలెట్ బాక్స్ లు, బ్యాలెట్ పేపరు, ఎన్నికలకు సంబంధించి సామగ్రిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్వోలు, పీవోలకు శిక్షణ ఇచ్చారు. వివిధ రాజకీయ పక్షాల నాయకులతో ఎన్నికల సంఘం సమావేశమైంది. ఎన్నికల అధికారులకు ట్రైనింగ్ కూడా పూర్తి చేశారు. త్వరలోనే మరోసారి అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది.
జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు
2021 సుప్రీంకోర్టు లోకల్ రిజర్వేషన్లపై ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. బీసీ డెడికేటెడ్ కమిషన్ నియమించడం, సర్వే చేసి రిపోర్ట్ ప్రభుత్వానికి అందజేయడం, దాన్ని గవర్నంట్ ఆమోదించడం, లేదా తిరస్కరించడం చేయాలని తీర్పు ఇచ్చింది. దాని ఆధారంగా ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేసిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ సారి స్థానిక రిజర్వేషన్ల బాధ్యతలు డెడికేటెడ్ కమిషన్కు అప్పగించింది. కాగా, పంచాయతీల సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను జనాభా ప్రతిపాదికన కేటాయించనున్నారు. గతంలో ఓటర్ల సంఖ్య ప్రాతిపదికన బీసీల రిజర్వేషన్ల ను ఖరారు చేసేవారు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ప్రకటించేవారు.