పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్సభలో విపక్షాలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్లో పరిస్థితులపై లోక్సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. మహారాష్ట్రలో భారీ వర్షాలకు నష్టపోయిన పంటపై శివసేన సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. ఫరూక్ అబ్దుల్లా విడుదలకు సంబంధించి టీఎంసీ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది.
టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రాంతీయ భాషా పరిరక్షణపై ప్రశ్నోత్తరాల్లో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ను జగన్ ప్రభుత్వం తప్పనిసరి చేసిందన్నారు. పాఠశాలల్లో త్రిభాష విధానాన్ని అమలు చేయాలన్నారు. ప్రాంతీయ భాషలను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రశ్నోత్తరాల్లో భాగంగా లోక్సభలో విపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. పలు అంశాలపై చర్చకు పట్టబట్టాయి. విపక్షాల నినాదాల మధ్యే స్పీకర్ ఓం బిర్లా సభను నిర్వహిస్తున్నారు.
అంతకు ముందు లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్సభ స్పీకర్ ఓంబిర్లా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
మరోవైపు రాజ్యసభలో ఇటీవల మృతి చెందిన పార్లమెంటు సభ్యులకు సంతాపం తెలిపారు. అరుణ్ జైట్లీ, జగన్నాథ్ మిశ్రా, సుష్మా స్వరాజ్ సహా ఇటీవల మృతి చెందిన సభ్యులకు ఉభయ సభలు సంతాపం తెలిపాయి.