విపక్షాల ఆందోళన.. ఉభయసభలు వాయిదా

విపక్షాల ఆందోళన.. ఉభయసభలు వాయిదా

విపక్షాల ఆందోళన నేపథ్యంలో రాజ్యసభ, లోక్ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదాపడ్డాయి.  ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైనప్పటి నుంచి నిత్యావసరాల ధరలు, జీఎస్టీ రేట్ల పెంపుపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. నిత్యావసరాల ధరల పెరుగుదలకు కళ్లెం వేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ నినాదాలు చేశాయి. జీఎస్టీ రేట్ల పెంపు సబబు కాదని పేర్కొన్నాయి.

ఇక లోక్ సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే.. కామన్వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించిన అథ్లెట్లను ప్రశంసిస్తూ స్పీకర్ ఒక సందేశాన్ని చదివి వినిపించారు. ఆ వెంటనే విపక్షాలు నిత్యావసరాల ధరలు, జీఎస్టీ రేట్ల పెంపుపై గళమెత్తాయి. కార్యకలాపాలకు ఆటంకం కలగడంతో స్పీకర్ లోక్ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.  కాగా, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి మొత్తం 27 మంది ఎంపీలు సస్పెన్షన్ కు గురయ్యారు. వీరిలో 23 మంది రాజ్యసభ ఎంపీలు, నలుగురు లోక్ సభ ఎంపీలు ఉన్నారు.