లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం సాయంత్రం తన చాంబర్లో ఎంపీలకు టీ పార్టీ ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన ఎంపీలతో పాటు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక, ఇతర ప్రతిపక్ష ఎంపీలు హాజరయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రియాంక ఒకేచోట కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు.
న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం సాయంత్రం తన చాంబర్లో ఎంపీలకు టీ పార్టీ ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన ఎంపీలతో పాటు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా గాంధీ, ఇతర ప్రతిపక్ష ఎంపీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పార్లమెంట్ సెషన్ ముగిసిన తర్వాత ఎంపీలకు స్పీకర్ టీ పార్టీ ఇవ్వడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే శుక్రవారం ఓం బిర్లా ఇచ్చిన పార్టీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్తో ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు జోక్లు వేసుకుంటూ సరదాగా మాట్లాడుకున్నారు. తాను మామూలు టీ తాగనని, వయనాడ్ హెర్బల్ టీ మాత్రమే తాగుతానని ప్రియాంక చెప్పారు. అలర్జీని నివారించడానికే వయనాడ్ హెర్బల్ టీ తీసుకుంటానని తెలిపారు. అలాగే మోదీ ఫారిన్ టూర్ గురించి ప్రియాంక ఈ సందర్భంగా ఆరా తీశారు. ‘‘మోదీజీ..! మీ ఫారిన్ టూర్ ఎలా జరిగింది?” అని ఆమె అడిగారు. బాగా జరిగిందని మోదీ సమాధానం చెప్పారు.
మోదీ ఇటీవలే ఇథియోపియా, జోర్డాన్, ఒమన్ లో పర్యటించారు. ఇక సమాజ్ వాదీ పార్టీ నుంచి ధర్మేంద్ర యాదవ్, ఎన్సీపీ (ఎస్పీ) నుంచి సుప్రియా సూలే, సీపీఐ లీడర్ డి.రాజా తదితరులు పాల్గొన్నారు. సెషన్ను కాస్త పొడిగించి ఉండాల్సిందని ధర్మేంద్ర అడగగా.. ‘‘ఎక్కువ సేపు మాట్లాడితే మీ గొంతు నొస్తుంది. అందుకే సెషన్ టైంను తగ్గించారు” అని మోదీ జోక్ చేశారు.
