ప్రైవేట్ హాస్పిటళ్ల దోపిడీ.. ఏజెంట్లుగా ఆర్ఎంపీలు, అంబులెన్సుల డ్రైవర్లు

ప్రైవేట్ హాస్పిటళ్ల దోపిడీ.. ఏజెంట్లుగా ఆర్ఎంపీలు, అంబులెన్సుల డ్రైవర్లు
  •     ఫీజును బట్టి కమీషన్​అందజేస్తున్న యాజమాన్యాలు
  •     సమస్య ఏదైనా పలు రకాల టెస్టులు రాస్తున్న డాక్టర్లు
  •     ఎవరికీ అర్థం కాకుండా ప్రిస్క్రిప్షన్లు
  •     సొంతంగా మెడికల్​ షాపులు రన్నింగ్ 

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటళ్లలో దోపిడీ ఎక్కువైంది. ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్​లో అడుగుపెడితే చాలు.. వివిధ రకాల టెస్టులు రాసి, అందినకాడికి దండుకుంటున్నారు. సొంతంగా మెడికల్​షాపులు నడుపుతూ పేషెంట్ల జేబులను ఖాళీ చేస్తున్నారు. హాస్పిటళ్ల యాజమాన్యాలు కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు, అంబులెన్సుల ఓనర్లు, డ్రైవర్లను ఏజెంట్లుగా మార్చుకుని పేషెంట్లను రప్పించుకుటున్నాయి.

పేషెంట్​సమస్య, బిల్లును బట్టి కమీషన్ అందజేస్తున్నాయి. చిన్నా పెద్ద, ముసలి, ముతక ఇలా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 ప్రైవేట్​హాస్పిటళ్లు ఉన్నాయి. ఒక్క నిజామాబాద్​సిటీలోనే 120 హాస్పిటళ్లు ఉన్నాయి. డెయిలీ వేల మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఈ హాస్పిటళ్లకు వస్తుంటారు.

రోజుకో ఘటన 

బాన్సువాడ సెగ్మెంట్ పోతంగల్​కు చెందిన నయీం ఈ నెల 9న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్​హాస్పిటల్ లో చేర్పించగా, డాక్టర్లు నయీం తలకు సర్జరీ చేశారు. అందుకు రూ.3లక్షల వరకు తీసుకున్నారు. తర్వాత నయీం కోలుకుంటున్నట్టు కుటుంబ సభ్యులను నమ్మించారు. దాదాపు మూడు రోజులు కుటుంబ సభ్యులను నయీం దగ్గరకు పోనివ్వలేదు. చివరికి అతను చికిత్స పొందూతూ చనిపోయాడని, మరో రూ.2 లక్షలు కడితేనే డెడ్​బాడీని ఇస్తామని సిబ్బంది చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇన్నిరోజులు డెడ్​బాడీకే ట్రీట్​మెంట్​చేశారని ఆరోపించారు.

అలాగే 10 రోజుల కింద సురేందర్(55) అనే గవర్నమెంట్ టీచర్ జీర్ణ సంబంధిత సమస్యతో బాధపడుతూ నిజామాబాద్​లోని హాస్పిటల్​కు వెళ్లాడు. డాక్టర్లు ఐసీయూలో ఉంచి రూ.60 వేల టెస్టులు చేయించారు. రెండు రోజులకు బిల్లు రూ.లక్షకు చేరిందని తెలిసి, సురేందర్​ డిశ్చార్జ్​ అయి ​ఇంటికి వెళ్లిపోయాడు. రెండురోజులకు సురేందర్​కోలుకున్నాడు. దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఆరేండ్ల బాబును తల్లిదండ్రులు ఓ పేరున్న చిల్డ్రన్స్ హాస్పిటల్​తీసుకెళ్లగా డాక్టర్లు ఇన్​పేషెంట్​గా చేర్చుకున్నారు. రెండు రోజులు ఉంచి, రూ.50 వేలు వసూలు చేశారు. తర్వాత బాబుకు ప్లేట్​లెట్స్​పడిపోతున్నాయని నమ్మించారు.

అనుమానంతో తల్లిదండ్రులు సీక్రెట్​గా బాబు బ్లడ్​శాంపిల్ ను మరో ల్యాబ్​కు పంపగా, అదేమీలేదని తెలిసింది. ఈ నెల16 దగ్గు, తుమ్ములతో నిజాబాద్​లోని ఓ ప్రైవేట్​హాస్పిటల్ లకు వచ్చిన నర్సమ్మ(53) అనే మహిళకు నుమెనియా పేరుతో ఇన్​పేషెంట్​గా చేర్చుకున్నారు. రెండు రోజుల ట్రీట్​మెంట్​పేరుతో రూ.55 వేలు బిల్లు వేయగా, కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. చిన్నపాటి సమస్యతో ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు వచ్చిన జమున అనే గిరిజన మహిళకు రూ.40 వేల టెస్టులు చేయించి, చివరికి  ఏమీలేదని, మంచిగా తిని రెస్ట్​ తీసుకోమని చెప్పి పంపించారు. ఇలా నిత్యం ప్రతి హాస్పిటల్​లో ఏదో ఒక రకంగా దోపిడీ జరుగుతూనే ఉంది.

క్వాలిఫైడ్​ స్టాఫ్​ ఉండట్లే..

ఎలాంటి ట్రైనింగ్, క్వాలిఫికేషన్​లేని వారిని చాలా హాస్పిటళ్లు సిబ్బందిగా నియమించుకుంటున్నాయి. ఇటీవల ఓ పిల్లల హాస్పిటల్​లో డాక్టర్​రాసిన ఇంజెక్షన్​ను నర్సుగా పనిచేసే యువతి వెంటవెంటనే ఇవ్వడంతో బాలుడు(8) చనిపోయాడు. డీఎంహెచ్ఓ తనిఖీలు తుతూ మంత్రంగా సాగుతున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేసి వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

హాస్పిటళ్లు సొంతంగా సొంత మెడికల్​షాపులు రన్​చేస్తూ దోచుకుంటున్నా, పట్టించుకోవడం పేషెంట్లు మండిపడుతున్నారు. ప్రిస్క్రిప్షన్​క్లియర్​గా రాయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా పట్టించుకోవడం లేదు. కొన్ని హాస్పిటళ్లు పీఆర్ఓలను నియమించుకుని మరీ దందా చేస్తున్నాయి. 40 శాతం వరకు కమీషన్ ఇస్తున్నాయి. ఆర్ఎంపీ, పీఎంపీలు, అంబులెన్స్​డ్రైవర్లను తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి.