శివుడు అభిషేక ప్రియుడు.. నెత్తిన కొన్ని నీళ్లు పోసినా సంతోషిస్తాడు

శివుడు అభిషేక ప్రియుడు.. నెత్తిన కొన్ని నీళ్లు పోసినా సంతోషిస్తాడు

కోరిన వరాలిచ్చే  భోళా శంకరుడిగా..కోపం వస్తే త్రినేత్రంతో భస్మం చేసే ప్రళయ రుద్రునిగా.. ప్రపంచాన్ని మింగేసే కాలకూట విషాన్ని గొంతులో దాచుకున్న నీలకంఠుడిగా, ఈశునిగా, సర్వేశునిగా, మహాదేవునిగా ఇలా ఎన్నో రూపాల్లో...ఎన్నో పేర్లతో.. భక్తుల కష్ట సుఖాల్లో వెన్నంటే ఉంటాడు పరమశివుడు. అటువంటి పరమశివుడు పార్వతి దేవిని పెండ్లాడింది ఈ రోజే . లింగ రూపంలో ఆవిర్భవించింది కూడా ఈరోజే అని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈరోజుని మహాశివరాత్రిగా ఊరూవాడా ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆ అర్థ నారీశ్వరుల ప్రేమ కథని, శివ లింగ ఆవిర్భావ కథని మరొక్కసారి గుర్తుచేసుకుందాం. 

శివుడు మామూలు బట్ట కట్టడు. పామునే ఆభరణంగా ధరిస్తాడు. శ్మశానమే అతని నివాసం. పార్వతి దేవి  హిమవంత రాజు కూతురు. అష్టైశ్వర్యాల్లో పుట్టి పెరిగింది. ప్రపంచంలోనే అందరి కన్నా అందగత్తె. ఇలా ఏ విషయంలోనూ శివ, పార్వతులు సమానం కాదు. కానీ, వాళ్ల ప్రేమ కథ లోకానికే ఆదర్శం అయింది. ఆ అర్థనారీశ్వరులు ప్రేమకే నిర్వచనం అయ్యారు. వీళ్లిద్దరి బంధం జన్మ, జన్మలది. పార్వతి దేవి మొదట దక్ష ప్రజాపతి కూతురు సతిగా పుడుతుంది. పుట్టుకతోనే శ్రీమంతురాలైన ఆమె శివుడ్ని అమితంగా ప్రేమిస్తుంది. మనసా, వాచా  ఆరాధిస్తుంది. ఎన్నో కష్టాల్ని అధిగమించి శివుడ్ని పెండ్లాడుతుంది కూడా. కానీ, శ్మశానమే ఇల్లుగా చేసుకున్న శివుడ్ని సతి పెండ్లాడటం నచ్చదు దక్షుడికి. దాంతో సతి ముందే శివుడ్ని అవమానిస్తాడు. అది భరించలేని సతి తన శరీరాన్ని, లోకాన్ని విడిచి వెళ్లిపోతుంది. మళ్లీ శివుడ్ని చేరుకోవడానికి హిమవంతుడి కూతురు పార్వతిగా జన్మిస్తుంది. ఈ జన్మలోనూ ఇద్దరూ ఆస్తిపాస్తులు, అందం.. ఇలా ఎందులోనూ ఒకటిగా లేరు. అయినా సరే శివుడి మనసు నచ్చి తల్లిదండ్రుల్ని ఒప్పించి శివుడి కోసం ఘోర తపస్సు చేస్తుంది పార్వతి. అది మెచ్చిన శివుడు మహా శివరాత్రి రోజే పార్వతీ దేవిని పెండ్లాడతాడు. అందుకే ఈరోజు ప్రతి శివాలయంలో శివ, పార్వతులకి ఘనంగా పెండ్లి చేస్తారు.

మరో కథ 
శివుడు లింగ రూపంలో ఆవిర్భవించింది కూడా ఈ రోజే అని శివపురాణం చెప్తోంది. ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప? అన్న వాదన మొదలైందట. వాళ్ల గర్వాన్ని పోగొట్టడానికి శివుడు లింగరూపంలో ఆవిర్భవించాడట. ఆ లింగం ఆది, అంతం తెలుసుకోగలిగిన వాళ్లే గొప్పవాళ్లని బ్రహ్మ, విష్ణువులకి చెప్తాడట శివుడు. అప్పడు ఆ లింగం మూలస్థానం చూసేందుకు విష్ణువు వరాహరూపంలో పైకి, అంతిమస్థానం చూసేందుకు బ్రహ్మ, హంస రూపంలో కిందివైపుకి ప్రయాణించారు. కానీ, ఎంత వెతికినా ఫలితం కనిపించలేదు. అప్పుడు బ్రహ్మ, విష్ణువులు శివుడి గొప్పదనాన్ని తెలుసుకుంటారు. మాఘ బహుళ చతుర్దశి నాడే ఈ మహాలింగం ఉద్భవించింది. అందుకే అది మహాశివరాత్రి పర్వదినమైందని చెప్తారు.

బిల్వ పత్రాలతో..
శివుడు అభిషేక ప్రియుడు. నెత్తిన కొన్ని నీళ్లు పోసినా సంతోషిస్తాడు. అందుకే ఈ రోజు శివుడికి భక్తులంతా అభిషేకాలు చేస్తారు. బిల్వదళాలను సమర్పించి  అష్టోత్తరశతనామ, సహస్రనామార్చనతో పాటు ప్రత్యేక పూజలు  నిర్వహిస్తారు. ఈ రోజున ఉపవాసం, జాగరణ చేస్తే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. రాత్రంతా శివ పూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీలా కథా పారాయణలు జరుపుతారు. అన్ని శివ క్షేత్రాలలో ఈ ఉత్సవం గొప్పగా జరుగుతుంది. 

::: దాసరి పృధ్వీ, బెల్లంపల్లి, వెలుగు