![లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్ నుంచి జినోమ్ టెస్టింగ్ సేవలు](https://static.v6velugu.com/uploads/2023/07/Lord's-Mark-Industries-launched-Lord's-Mark-Microbiotech_w3OpcBo1qm.jpg)
హైదరాబాద్: లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్.. జినోమ్ టెస్టింగ్ కోసం లార్డ్స్ మార్క్ మైక్రోబయోటెక్ అనే కొత్త అనుబంధ సంస్థను ప్రారంభించింది. మై డీఎన్ఏ బ్రాండ్ ద్వారా జన్యు పరీక్ష కోసం లాలాజల -ఆధారిత టెక్నాలజీని తీసుకొచ్చింది. క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధులు, డయాబెటిస్, వంశపారంపర్య సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాల గుర్తించి దీని ద్వారా తెలుసుకోవచ్చు. బాడీ ఫిట్నెస్, మందులు ఎలా పనిచేస్తాయి.. తదితర వివరాలను కూడా తెలియజేస్తుంది. ఈ టెస్టు ఫలితాల్లో 99 శాతం కచ్చితత్వం ఉంటుందని లార్డ్స్ మార్క్ తెలిపింది. ఈ పరీక్షకు రక్తం లేదా ఫ్లెబోటోమిస్ట్ అవసరం లేదు. ఇంటి దగ్గరే కిట్లోని సూచనలను చదివిన తర్వాత సొంతంగా పరీక్ష చేసుకోవచ్చు.
కిట్స్ ధర రూ.ఎనిమిది వేల నుంచి రూ.16 వేల వరకు ఉంటుంది. డాక్టర్లు, హాస్పిటల్స్ ద్వారా దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలకు జన్యు పరీక్షల కోసం ప్రొడక్టులను, టెక్నాలజీలను అందుబాటులో ఉంచుతామని కంపెనీ తెలిపింది. కంపెనీ వెబ్సైట్ ద్వారా జీనోమ్ టెస్టింగ్ కిట్లను ఆన్లైన్లో ఆర్డర్ చేయవచ్చు. రెండు రోజుల్లోపు డెలివరీ ఇస్తారు. పరీక్ష నిర్వహించిన తర్వాత రివర్స్ పిక్ అప్ సదుపాయం కూడా ఉంటుంది. పాలిజెనిక్ రిస్క్ స్కోర్ (పీఆర్ఎస్) ను లెక్కించడానికి స్నాపీ అనే పేటెంట్ అల్గారిథమ్ కూడా తమ దగ్గర ఉందని లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్ తెలిపింది.