కరోనా వైరస్ రోజుకో రూపం తీసుకుంటున్నట్లే రోజుకో కొత్త సమస్య వస్తోంది. కోవిడ్ వచ్చిన మొదట్లో వాసన తెలియదనే అనుకున్నాం. ఇప్పుడా సమస్యకుతోడు వాసనే కాదు మంచి వాసనలు కూడా చెడు వాసనలుగా అనిపిస్తున్నయని చెబుతున్నారు కొందరు పేషెంట్స్. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు వైరస్ చచ్చినా దాని పీడ వదలట్లేదు. వైరస్ తెచ్చిన వింత వికారాన్నివదిలించుకునేది ఎలాగో డాక్టర్ రఫీ చెబుతున్నారు.
కరోనా వైరస్ మన ఊపిరితిత్తుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని తొలిరోజుల్లోనే తెలిసిపోయింది. అయితే ఈ తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల ముక్కులో కూడా ప్రభావం ఉంటుందని తర్వాత కాలంలో డాక్టర్లు గుర్తించారు. కోవిడ్ వచ్చిపోయి నెలలు అవుతున్నా ఆ నాడీ కణాల సమస్య మాత్రం పోవట్లేదని కోలుకున్నవాళ్ల సమస్యలను గుర్తించాక చెబుతున్నారు.
నాడీ కణాలపై దాడి
కోవిడ్ పేషెంట్స్లో 30 శాతం మంది వాసన పసిగట్టలేకపోతున్నారు. ఇలా జరగడానికి కారణం.. ముక్కునాడీ కణాలు దెబ్బతినడమే. వైరస్ ఎఫెక్ట్తో అవిపాడవుతాయి. చాలా రకాల జబ్బులు వచ్చినప్పుడు కూడా ఇలాంటి సమస్య వస్తుంది. ఇలా వాసన తెలియకపోవడాన్ని ‘ఎనాస్మియా’ అంటారు. ఈ ఎనాస్మియా రావడానికి కారణం ఏదైనా కొన్ని రోజుల తర్వాత అదే తగ్గిపోతుంది. తర్వాత సాధారణ పరిస్థితే ఉంటుంది. అయితే కోవిడ్ సోకిన వాళ్లలో ఎనాస్మియా సమస్య పెరాస్మియాగా మారిపోతోంది. ఎనాస్మియాని భరించడం కష్టం కాదు. కానీ పెరాస్మియా అలా కాదు... కోవిడ్ ఎంత ఇబ్బంది పెట్టిందో అంత ఇబ్బందిపెడుతోందని పేషెంట్స్ అంటున్నారు.
ఎనాస్మియా సమస్యతో బాధపడేవాళ్లు పదార్థాల వాసన మాత్రమే గుర్తించలేరు. తినడానికి, నిద్రపోవడానికి, పనులు చేసుకోవడానికి ఈ సమస్య వల్ల ఏ ఇబ్బందీ ఉండదు. కానీ పెరాస్మియా అలా కాదు. ముక్కులోని నాడీ కణాలు దెబ్బతినడం వల్ల సాధారణంగా అసౌకర్యం కలిగించే వాసన తగిలాయంటే తట్టుకోలేరు. ఇక డ్రైనేజీ, కుళ్లిపోయిన పదార్థాలు కొన్ని రసాయనాల వాసనలు ముక్కుకి తగిలిందంటే భరించలేరు. కడుపులో తిప్పుతుంది. వాంతులు అవుతాయి. ఏ పనీ చేయలేరు.
గాలిలో ఉండే పొగ, ఇతర పొల్యూషన్స్ వల్ల ఉండే సమస్య ఇతరుల కంటే వీళ్లలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పనులు చేయలేరు. ఫుడ్ వాసన కూడా వీళ్లలో వికారం కలిగించవచ్చు. శానిటైజర్స్ వాసనకు కూడా వాంతులు వస్తాయి. టానిక్, మెడిసిన్స్ వాసన కూడా భరించలేరు. వాంతి చేసుకుంటారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇప్పటికిప్పుడే సాధ్యం కాదు. కొన్ని రోజుల్లో ఆ నాడీ కణాలు మెరుగవుతాయి. అంది అందరిలో ఒకే తీరుగా ఉండదు. కాబట్టి, ఇన్ని రోజులకు పరిస్థితి మామూలుగా అవుతుందని చెప్పలేం.
మూడు వికారాలు
పెరాస్మియా లక్షణాలు అందరిలో ఒకేలాగా లేవు. కోవిడ్ బారిన పడిన వాళ్లలో 15 శాతం మంది మాత్రమే పెరాస్మియా సమస్యను ఎదుర్కొంటున్నారు. కోవిడ్ సోకినప్పుడు వాసన గుర్తించలేకపోయినవాళ్ల(ఎనాస్మియా)లో కొందరిలో అది తగ్గిన వెంటనే పెరాస్మియా (సాధారణమైన చెడు వాసన భరించలేని స్థితి)తో బాధపడుతున్నారు. మరికొంతమందిలో కోవిడ్ వచ్చినప్పుడు ఎనాస్మియా ఉంటుంది. ఎనాస్మియా సమస్య పోయి వాసనలు సరిగానే గుర్తించే స్థితికి వస్తున్నారు. కొన్ని రోజులు లేదా నెలల తర్వాత పెరాస్మియా సమస్య సడెన్గా వస్తుంది. కొన్ని అరుదైన కేసుల్లో కోవిడ్ వచ్చినప్పుడు వాసన బాగానే తెలుస్తుందంటున్నారు. కోవిడ్ తగ్గిన కొన్ని నెలల తర్వాత పెరాస్మియా సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఇలా మూడు రకాలుగా ఇబ్బంది పడుతున్న పెరాస్మియా రోగులందరూ వాంతులు, వికారం, తినలేకపోవడం, పనులు సరిగా చేయలేకపోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
మన దగ్గర పేషెంట్స్లో, మన వాతావరణంలో 10 నుంచి 15 శాతం మందిలో ఈ సింప్టమ్స్ ఉంటున్నాయని చెబుతున్నారు. పెరాస్మియా సమస్య ఉంటే.. కిచెన్లో ఘుమఘుమలతో నోరూరించే వంటకాన్ని కూడా తినలేరు. ఒకవేళ తిన్నా వికారం అనిపించి వాంతి చేసుకోవచ్చు. ఇలాంటప్పుడు డాక్టర్ సలహాతో వాంతి కాకుండా మందులు తీసుకోవాలి. వికారం ఉన్నా, వాంతి అయినా వెంటనే అది పెరాస్మియాగా గుర్తించాలి. సొంతంగా మందులు వాడకుండా డాక్టర్ సలహాతో మెడిసిన్స్ తీసుకుంటే వాంతులు కంట్రోల్ అవుతాయి.
యువతలోనే ఎక్కువ
ఎనాస్మియా సమస్య కోవిడ్ బారిన పడిన యువతలోనే ఎక్కువగా ఉంది. కొందరికి శ్వాస సమస్యలు ఉండవు. ఒళ్లు నొప్పులు ఉండవు. కానీ వాసన తెలియట్లేదని అంటారు. వీళ్లు కోవిడ్ నుంచి తొందరగా కోలుకుంటారు. కానీ, తర్వాత పెరాస్మియా సమస్యతో బాధపడొచ్చు. కోవిడ్ నుంచి కోలుకున్న యువత కాస్త జాగ్రత్తగానే ఉండాలి.