
లక్నో: ఐపీఎల్16లో లక్నో సూపర్ జెయింట్స్ అనూహ్యంగా ఆడుతోంది. గత మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై చెలరేగిపోయి లీగ్లో సెకండ్ హయ్యెస్ట్ స్కోరు చేసిన లక్నో మరోసారి చిన్న టార్గెట్ ఛేజింగ్లో చతికిల పడింది. సోమవారం తమ సొంతగడ్డపై జరిగిన పోరులో 127 రన్స్ టార్గెట్ కూడా ఛేజ్ చేయలేకపోయింది. మరోవైపు అద్భుత బౌలింగ్లో స్వల్ప స్కోరు కాపాడుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18 రన్స్ తేడాతో లక్నోను చిత్తు చేసింది. తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 126/9 స్కోరు చేసింది. కెప్టెన్ ఫా డుప్లెసిస్ (40 బాల్స్లో 1 ఫోర్, 1 సిక్స్తో 44), విరాట్ కోహ్లీ (30 బాల్స్లో 3 ఫోర్లతో 31) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ మూడు, బిష్ణోయ్, మిశ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్లో లక్నో 19.5 ఓవర్లలో 108 రన్స్ కే ఆలౌటైంది. కృష్ణప్ప గౌతమ్ (23), అమిత్ మిశ్రా (19) టాప్ స్కోరర్లు. హేజిల్వుడ్, కర్ణ్ శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. డుప్లెసిస్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
డుప్లెసిస్, కోహ్లీ రాణించినా..
ఓపెనర్లు డుప్లెసిస్, విరాట్ కోహ్లీ తొలి వికెట్కు 62 రన్స్తో మంచి పునాది వేసినా తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఆర్సీబీ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఫస్ట్ బాల్నే కోహ్లీ బౌండ్రీకి చేర్చాడు. నవీన్ బౌలింగ్ అతను ఫోర్, డుప్లెసిస్ సిక్స్ కొట్టడంతో 4 ఓవర్లకు ఆర్సీబీ 32/0తో నిలిచింది. కానీ, ఐదో ఓవర్ నుంచి స్పిన్నర్లు క్రునాల్, బిష్ణోయ్, మిశ్రా, గౌతమ్ ఎంట్రీతో కోహ్లీ, డుప్లెసిస్ తడబడ్డారు. 5 నుంచి 15 ఓవర్లలో ఒకే ఒక్క బౌండ్రీ వచ్చింది. ఈ క్రమంలో తొమ్మిదో ఓవర్లో కోహ్లీని స్టంపౌట్ చేసిన బిష్ణోయ్.. 13వ ఓవర్లో ప్రమాదకర మ్యాక్స్వెల్ (4)ను ఎల్బీ చేశాడు. గౌతమ్ బౌలింగ్లో అనుజ్ రావత్ (9) వెనుదిరిగ్గా.. ప్రభుదేశాయ్ (6) కూడా నిరాశ పరిచాడు. 15.2 ఓవర్లలో ఆర్సీబీ 93/4 వద్ద వర్షం వల్ల ఆట నిలిచింది. 26 నిమిషాల తర్వాత మళ్లీ మొదలవగా ఫస్ట్ బాల్ను బౌండ్రీకి చేర్చిన దినేశ్ కార్తీక్ (16).. మిశ్రా వేసిన తర్వాతి ఓవర్లో సిక్స్తో జోరు పెంచాడు. కానీ, అదే ఓవర్లో డుప్లెసిస్ ఔటవడంతో ఆర్సీబీ డీలా పడింది. 18వ ఓవర్లో లమ్రోర్ (3)ను నవీన్ పెవిలియన్ చేర్చగా.. తర్వాతి ఓవర్లో డబుల్ తీసే ప్రయత్నం కార్తీక్ రనౌటయ్యాడు. చివరి ఓవర్లో నవీన్ వరుస బాల్స్లో కర్ణ్ వర్మ (2), సిరాజ్ (0)ను ఔట్ చేసి హ్యాట్రిక్ పై నిలవగా.. లాస్ట్ బాల్ను బౌండ్రీ చేర్చిన హసరంగ (8*) ఇన్నింగ్స్ ముగించాడు.
జెయింట్స్ ఢమాల్
భారీ బ్యాటింగ్ లైనప్ ఉన్న లక్నో ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు చిన్న టార్గెట్ ఛేజింగ్లో చేతులెత్తేసింది. క్రమం తప్పకుండా వికెట్లు తీసిన ఆర్సీబీ ప్రత్యర్థిని దెబ్బకొట్టింది. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ రెండో బాల్కే మేయర్స్ (0) మిడాన్లో అనుజ్కు క్యాచ్ ఇవ్వడంతో ఆ జట్టు పతనం మొదలైంది. వన్డౌన్లో వచ్చిన స్టాండిన్ కెప్టెన్ క్రునాల్ పాండ్యా (14).. సిరాజ్ తర్వాతి ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో ఎదరుదాడి చేశాడు. కానీ, మ్యాక్స్వెల్ వేసిన నాలుగో ఓవర్లో భారీ షాట్కు ట్రై చేసి కోహ్లీకి క్యాచ్ ఇవ్వగా.. హేజిల్వుడ్ బౌలింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్ బదోనీ (4) కూడా కోహ్లీకే చిక్కాడు. ఆపై, హసరంగ వేసిన ఆరో ఓవర్ తొలి బాల్కే దీపక్ హుడా (1) స్టంపౌటవడంతో పవర్ప్లేలోనే లక్నో 34/4తో నిలిచింది. క్రీజులో కుదురుకున్న స్టోయినిస్ (13)తో పాటు పూరన్ (9) చెరో సిక్స్ కొట్టి జోరు మీద కనిపించారు. కానీ, కర్ణ్ శర్మ బౌలింగ్లో మరో షాట్కు ట్రై చేసిన పూరన్ ఔటవడంతో 38 రన్స్కే జెయింట్స్ సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్టోయినిస్కు తోడైన కృష్ణప్ప గౌతమ్.. కర్ణ్ బౌలింగ్లో 6, 4.. హరసంగ ఓవర్లో సిక్స్తో ఛేజింగ్కు ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు. క్రీజులో కుదురుకుంటే రన్స్ వస్తున్నప్పటికీ కర్ణ్ వేసిన 11వ ఓవర్లో భారీ షాట్ ఆడి స్టోయినిస్ ఔట్ అవగా.. తర్వాతి ఓవర్లో డబుల్కు ట్రై చేసి గౌతమ్ రనౌటవడంతో 65/7తో లక్నో ఓటమి ముంగిట నిలిచింది. ఈ దశలో స్పిన్నర్లు మిశ్రా, బిష్ణోయ్ (5) కాసేపు ప్రతిఘటించారు. కానీ, 15వ ఓవర్లో డబుల్ కోసం పరుగెత్తి బిష్ణోయ్ రనౌట్గా వెనుదిరిగాడు. ఈ టైమ్లో రెండు ఫోర్లు కొట్టిన నవీన్ (13) 19వ ఓవర్లో ఔటవగా.. చివరి బ్యాటర్గా వచ్చిన కేఎల్ రాహుల్ (0 నాటౌట్) సింగిల్ కూడా తీయలేకపోయాడు. చివరి ఓవర్ ఐదో బాల్కు మిశ్రా లాస్ట్ వికెట్గా ఔటయ్యాడు.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 20 ఓవర్లలో 126/9 (డుప్లెసిస్ 44, కోహ్లీ 31, నవీన్ 3/30, బిష్ణోయ్ 2/21)
లక్నో: 19.5 ఓవర్లలో 108 ఆలౌట్ (గౌతమ్ 23, మిశ్రా 19, హేజిల్వుడ్ 2/15, కర్ణ్ శర్మ 2/20)