
న్యూఢిల్లీ: రియల్టీ కంపెనీ మాక్రోటెక్ డెవలపర్స్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 4,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ముంబై కేంద్రంగా పనిచేసే ఈ లిస్టెడ్ కంపెనీ, లోధా బ్రాండ్ కింద బిజినెస్ను ఆపరేట్ చేస్తోంది. వడ్డీ రేట్లు, ఇండ్ల ధరలు పెరిగినప్పటికీ రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు డిమాండ్ బలంగా కొనసాగుతోందని మాక్రోటెక్ డెవలపర్స్ ఎండి సీఈఓ అభిషేక్ లోధా పేర్కొన్నారు.
2022–-23 లో అమ్మకాలు, బుకింగ్లు 34 శాతం పెరిగి రూ.12,014 కోట్లకు చేరాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధితో రూ.14,500 కోట్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. కంపెనీ దగ్గర రూ. 4,600 కోట్ల విలువైన నెట్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో మిగులు ఉందన్నారు. మిగులు డబ్బును భూములను కొనడానికి, అప్పులు చెల్లించడానికి వాడామన్నారు. "2022–-23 ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ. 3,300 కోట్లకుపైగా ఖర్చు చేశాం.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది మరింత పెరుగుతుంది. దాదాపు రూ.4,300-– 4500 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేస్తాం ” అని లోధా చెప్పారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణే మార్కెట్లలో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తామని ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే బెంగళూరులో రెండు ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. మాక్రోటెక్ డెవలపర్స్కు ఈ మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో ఏకీకృత నికర లాభం 39 శాతం పెరిగి రూ.744.36 కోట్లకు చేరుకుంది.