మహిళ అకౌంట్లో రూ.3.10లక్షలు : మోడీ వేశాడనుకుంది.. కానీ!

మహిళ అకౌంట్లో రూ.3.10లక్షలు : మోడీ వేశాడనుకుంది.. కానీ!

మధ్యప్రదేశ్ లోని కరైనా తెహ్సీల్ .. సిర్సోనా గ్రామంలో ఓ వింత సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన మమత కొలి అనే మహిళ బ్యాంక్ అకౌంట్ లో ఇటీవల రూ.3లక్షల 10 వేలు డిపాజిట్ అయ్యాయి. తన బ్యాంక్ ఖాతాలో జమ అయిన డబ్బులు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వేశాడని పొంగిపోయింది. ఆనందంతో… తమ కుటుంబానికి ఉన్న అప్పులు కట్టేసింది. కొన్ని బంగారు నగలు కొనుక్కుంది. తన భర్తకు ఓ బైక్ కూడా కొనిచ్చింది. కొన్ని డబ్బులను అవసరానికి వాడుకున్నారు. అంతా సంతోషంగా గడిచిపోతుండగా.. సడెన్ గా బ్యాంక్ అధికారులు పోలీసులతో సహా ఆమె ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత కథంతా మారిపోయింది.

అధికారులు ఆ డబ్బులపై ఆమెను నిలదీశారు. అకౌంట్ లో డబ్బులు పడితే వెంటనే బ్యాంకుకు తెలియజేయాల్సింది పోయి సొంతానికి వాడుకుంటారా అని ప్రశ్నించారు. తనకే పాపం తెలియదని… రెండు చేతులు జోడించి వేడుకుంది. జన్ ధన్ అకౌంట్ కింద.. జీరో బ్యాలెన్స్ అకౌంట్ మాత్రమే తమకు ఉందని వివరించింది. ఖర్చులు అన్నీ పోను తన దగ్గర రూ.85వేలు ఉన్నాయని.. అవి తీసుకోండని ఇచ్చేసింది. అప్పులకు కట్టిన డబ్బులు తెచ్చి ఎలా ఇస్తామని ఏడ్చింది. ఐతే… గడువు పెట్టిన అధికారులు… ఆలోపు తమకు డబ్బు కట్టాల్సిందిగా ఆమెకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు.

ఆ డబ్బెక్కడిది…?

అదే గ్రామంలో అనిల్ నాగర్ అనే వ్యాపారి ఉన్నాడు. కూతురు పెళ్లికోసం అతడు ట్రాక్టర్ అమ్మగా వచ్చిన రూ.3.50లక్షలు బ్యాంక్ లో వేశానని వ్యాపారి చెప్పాడు. ఓ వ్యక్తికి చెక్కు ఇస్తే అది బౌన్స్ అయిందని … బ్యాంక్ కు వెళ్లి పాస్ బుక్ వెరిఫికేషన్ చేస్తే… రూ.3.10 లక్షలు వేరే అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ అయినట్టు తెల్సుకున్నాడు. అనిల్ నాగర్ బ్యాంక్ అకౌంట్ లో బాధితురాలు మమత ఆధార్ నంబర్ లింక్ అయిందనీ.. ఓ ట్రాన్సాక్షన్ లో డబ్బులు ఆమె అకౌంట్లోకి ట్రాన్స్ ఫర్ అయినట్టుగా బ్యాంక్ అధికారులు తేల్చారు. అతడు పోలీసులకు కంప్లయింట్ చేయడంతో.. వ్యవహారం ఇంతదూరం వచ్చింది. బ్యాంక్ అధికారుల తప్పిదంతో ఓ పేద కుటుంబం ఇబ్బందుల్లో పడింది.