న్యూఢిల్లీ, వెలుగు: మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణకు అరుదైన గౌరవం దక్కింది. ఆఫ్రికా అధికారిక పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి డీకే అరుణ పాల్గొననున్నారు. ఈ మేరకు శనివారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి బృందంతో కలిసి సౌతాఫ్రికాకు పయనమయ్యారు.
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్యం, వ్యవసాయం, సాంకేతికత వంటి కీలక రంగాల్లో భారత్, ఆఫ్రికా దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడంపై ప్రధానంగా చర్చలు జరపనున్నారు.
గ్రామీణాభివృద్ధి, మహిళల పురోగతి, రైతుల సంక్షేమానికి ఆమె చేసిన సేవలకుగాను జాతీయ స్థాయిలో గుర్తింపు లభించించింది. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. ‘‘నా పర్యటన ద్వారా మహిళలు, రైతులు, యువతకు ఉపయోగపడే అవకాశాలను తెలంగాణకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తా. ఈ పర్యటనతో భారత్–-ఆఫ్రికా సంబంధాలు కొత్త దిశగా పయనిస్తాయని భావిస్తున్నా’’ అని పేర్కొన్నారు.
