మరాఠా కోటాకు మహారాష్ట్ర ఓకే

మరాఠా కోటాకు మహారాష్ట్ర ఓకే
  • మరాఠా కోటాకు మహారాష్ట్ర ఓకే
  • ఓబీసీ సర్టిఫికెట్లు ఇస్తామని  సీఎం ఏక్​నాథ్ షిండే హామీ
  • నిరాహారదీక్ష విరమించిన ఉద్యమ నేత మనోజ్​ జరంగే

ముంబై: మరాఠా రిజర్వేషన్లకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. మరాఠాలకు కుంబీ కమ్యూనిటీ కింద ఓబీసీ రిజర్వేషన్ ​కల్పించాలనే డిమాండ్​తో మంబైలోని వాశిలో నిరాహారదీక్ష చేపట్టిన మరాఠా కోటా ఉద్యమకారుడు మనోజ్​ జరంగే పాటిల్​ శనివారం దీక్ష విరమించారు. అంతకుముందుగా సీఎం ఏక్ నాథ్ షిండే ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు గిరీశ్ మహాజన్, మంగళ్ ప్రభాత్ లోధా, దీపక్ కేసర్కర్ తదితరులు పాల్గొని చర్చించారు. 

మరాఠాలకు ఓబీసీ సర్టిఫికెట్లు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని పాటిల్ కోరారు. అయితే మరాఠాలకు కుంబీ కమ్యూనిటీ కింద ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు సమావేశంలో సీఎం, మంత్రులు అంగీకరించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. తర్వాత అక్కడి ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్​లో ఏక్ ​నాథ్ ​షిండే ఇచ్చిన జ్యూస్ తాగి మనోజ్ జరంగే తన నిరాహార దీక్షను విరమించారు. అక్కడికి వేలాదిగా తరలివచ్చిన ఉద్యమకారులు, కార్మికులు సంబురాలు చేసుకున్నారు. అనంతరం మనోజ్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రభుత్వం తమ అభ్యర్థనను అంగీకరించిందని తెలిపారు. దీంతో తాము దీక్ష విరమించినట్టు ప్రకటించారు.