మహా శివరాత్రి ప్రాముఖ్యత, ఉపవాసం ఎలా చేయాలి..?

మహా శివరాత్రి ప్రాముఖ్యత, ఉపవాసం ఎలా చేయాలి..?

మహా శివరాత్రిని 'ది గ్రేట్ నైట్ ఆఫ్ శివ' అని కూడా పిలుస్తారు. శీతాకాలానికి ముగింపు పలుకుతూ, వేసవికి స్వాగతం చెబుతూ వచ్చే పండుగే మహా శివరాత్రి. ఈ రోజున శివాలయాలన్నీ హర హర మహాదేవ అన్న కీర్తనలు, జపాలతో మారుమోగుతూ ఉంటాయి. సంవత్సరంలో వచ్చే 12 మాస శివరాత్రుల్లో ఈ మహా శివరాత్రి అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. అందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయి. మహా శివరాత్రి పండుగను ఏ రోజున జరుపుకుంటారు? ఎందుకు జరుపుకుంటారు..? శివుడిని పూజించే సమయాలు, ఉపవాసం ప్రాముఖ్యత, ఉపవాసం ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారం గురించి  టే ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

మహా శివరాత్రి ఎప్పుడు?

హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్షంలోని పద్నాలుగో రోజు (చతుర్దశి)న మహా శివరాత్రి జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇది ఫిబ్రవరి 18, 2023 (శనివారం) వస్తుంది.

మహాశివరాత్రి  ప్రాముఖ్యత, ఎందుకు జరుపుకుంటారు?

మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారన్న దానికి సంబంధించి పురాణాల్లో అనేక కథలున్నాయి. మహాశివరాత్రి అనేది శివుడు సృష్టిని కాపాడేందుకు తాండవ నృత్యం చేసిన రోజని కొన్ని పురాణాలు చెబితే.. శివుడు, పార్వతీ దేవిని వివాహం చేసుకున్న రోజని మరికొన్ని చెబుతున్నాయి. ఒక కథ ప్రకారం సముద్ర మథనంలో ఉద్భవించిన గరళం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని భావించి కొందరు దేవతలు, రాక్షసులు సాయం కోసం శివుని వద్దకు వెళ్తారు. అప్పుడు సృష్టి వినాశనాన్ని నివారించేందుకు సముద్రం చిమ్మే విషాన్ని శివుడు గరళంలో దాచుకుంటాడు. అప్పట్నుంచి శివుని కంఠం నీలి రంగులోకి మారిపోయిందని కొందరు చెబుతూ ఉంటారు. అంతే కాదు అందుకే శివునికి నీల కంఠ అన్న పేరు వచ్చిందని నమ్ముతారు.

ఉపవాసం ఎలా చేస్తారు..?

మహా శివరాత్రిని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలు భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే ఈ రోజున చాలా మంది భక్తులు శివ లింగానికి పాలు, చందనం, నెయ్యి, పంచదార తదితర వస్తువులతో అభిషేకం చేస్తూ, శివార్చన నిర్వహిస్తారు. శివ భక్తులు 24గంటలు ఉపవాస దీక్ష, జాగారం చేసి మరుసటి రోజు ఉదయం దీక్షను విరమిస్తారు.  మహా శివరాత్రిని ఎక్కువగా రాత్రిపూట ఘనంగా జరుపుకుంటారు. అందుకే మిగతా పండుగల కంటే ఈ పండుగ భిన్నంగా ఉంటుంది. 

భక్తులు ఉపవాసం ఉంటూనే రాగులు, సాబుదానా, పండ్లు తదితర సాత్విక ఆహారాన్ని తీసుకుంటారు. మరికొందరు రోజంతా చుక్క నీరు కూడా తీసుకోకుండా కఠినమైన 'నిర్జల' వ్రతాన్ని అనుసరిస్తారు. అయితే ఈ ఉపవాసాలు అనారోగ్యంతో ఉన్నవారికి, వృద్ధులకు లేదా గర్భిణులకు మంచివి కావని వైద్యులు చెబుతుంటారు. భక్తులు మహాశివరాత్రి ఉపవాసం రోజున తేలికపాటి శాకాహారం మాత్రమే తీసుకోవాలి. ఉపవాసం ఉన్నవారు పండుగ ముందు రోజు ఒక్కసారి మాత్రమే తినాలి. మరుసటి రోజు ఉదయం నుంచి తరువాతి రోజు ఉదయం వరకు ఉపవాసం ఉంటానని 'సంకల్పం' తీసుకోవాలి . మరుసటి రోజు సూర్యోదయం తర్వాత మాత్రమే ఉపవాసాన్ని విరమించాలి.

ఉపవాసం చేసేటపుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు...

  • ఉపవాసం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి
  • తలస్నానం చేసి శుభ్రమైన తెల్లని దుస్తులను ధరించాలి
  • రోజంతా ఓం నమః శివాయ అనే జపాన్ని పఠిస్తూ ఉండాలి

ఉపవాసం చేసే భక్తులు శివ పూజకు ముందు మరోసారి సాయంత్రం స్నానం చేయాలి. మరుసటి రోజు ఉదయం మళ్లీ స్నానం చేసి, పూజ చేసి తమ ఉపవాసాన్ని విరమించాలి. శివునికి పాలు, ధాతుర పుష్పాలు, చందనం, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితరాలను నైవేద్యంగా సమర్పించవచ్చు. పంచాంగం ప్రకారం వ్రత ఫలితం దక్కాలంటే తెల్లవారుజామున చతుర్థశి తిథి ముగిస్తుండగా ఉపవాసం విరమించాలి. 

తినకూడనివి

  • బియ్యం, గోధుమలు లేదా పప్పులతో చేసిన ఆహార పదార్థాలు
  • వెల్లులి, ఉల్లిపాయలు, మాంసాహారం

గమనిక

  • శివలింగానికి కొబ్బరి నీళ్లు నైవేద్యంగా సమర్పించడం మంచిది కాదు.