Mahesh Babu: బెంగళూరులో మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా.. AMB సినిమాస్ ఓపెనింగ్‌లో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్!

Mahesh Babu: బెంగళూరులో మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా.. AMB సినిమాస్ ఓపెనింగ్‌లో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్అంతా ఇంతాకాదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పొరుగున ఉన్న కర్ణాటకలోనూ ఆయనకు ఏ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తాజాగా బెంగళూరులో జరిగిన ఒక సంఘటన నిరూపించింది. బెంగళూరులోని గాంధీ నగర్‌లో కొత్తగా నిర్మించిన AMB సినిమాస్ ప్రారంభోత్సవానికి మహేష్ బాబు హాజరైయ్యారు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరోను చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.  ఒక్కసారిగా మహేష్ బాబును చుట్టుముట్టారు.

మహేష్ బాబును చుట్టుముట్టిన ఫ్యాన్స్

ఒకప్పుడు బెంగళూరులో ఐకానిక్ థియేటర్‌గా వెలుగొందిన 'కపాలి' థియేటర్ ఉన్న స్థలంలోనే అత్యాధునిక ఏఎమ్‌బీ (AMB) మల్టీప్లెక్స్‌ను హీరో మహేష్ బాబు నిర్మించారు. శుక్రవారం (జనవరి 16) ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి మహేష్ బాబు వస్తున్నారన్న సమాచారంతో వేల సంఖ్యలో అభిమానులు గాంధీనగర్‌కు చేరుకున్నారు. మహేష్ బాబు కారు దిగగానే ఒక్కసారిగా అభిమానులు ఆయనను చూడటానికి ఎగబడ్డారు. దీంతో అక్కడ తీవ్రమైన తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. చివరకు సెక్యూరిటీ సిబ్బంది ఎంతో శ్రమించి మహేష్ బాబును సురక్షితంగా లోపలికి తీసుకెళ్లారు.

దక్షిణాదిలోనే తొలి 'డాల్బీ సినిమా'

హైదరాబాద్‌లో ఇప్పటికే సంచలనం సృష్టించిన AMB సినిమాస్, ఇప్పుడు బెంగళూరులో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇది దక్షిణాదిలోనే మొట్టమొదటి Dolby Cinema అనుభవాన్ని అందించే థియేటర్. 4K లేజర్ ప్రొజెక్షన్, లగ్జరీ ఆడిటోరియమ్స్, అద్భుతమైన డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్‌తో సినీ ప్రేమికులకు ప్రపంచ స్థాయి అనుభూతిని పంచనుంది. ఈ టెక్నాలజీని తీసుకురావడానికి కష్టపడ్డ AMB టీమ్‌ను మహేష్ బాబు ప్రత్యేకంగా అభినందించారు.

 

'వారణాసి' లేటెస్ట్ అప్‌డేట్స్

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రపంచస్థాయి అడ్వెంచర్ మూవీ "వారణాసి" లో నటిస్తున్నారు. ఈ మైథాలజీ అండ్ ఫారెస్ట్ అడ్వెంచర్‌లో మహేష్ బాబు 'రుద్ర' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇందులో 'మందాకిని'గా మహేష్ బాబు సరసన నటిస్తుంది. ఇక మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ'గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించనున్నారు. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు .  కె.ఎల్. నారాయణ , ఎస్.ఎస్. కార్తికేయ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.