- రాహుల్ను ప్రధానిని చేసి మూడు నెలల్లో సాధించుకుంటాం
- టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
మహబూబ్నగర్/నాగర్ కర్నూల్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని, రాహుల్గాంధీ ప్రధానిని చేసిన మూడు నెలల్లో పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు జాతీయ హోదా తీసుకొస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్లో మంగళవారం కొత్తగా నియమితులైన డీసీసీ ఆఫీస్ బేరర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'పాలమూరు జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైంది.
కానీ, జిల్లాను వెనుకపడేశారు. పాలమూరు , రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతున్నా బీజేపీ పెడచెవిన పెడుతోంది. పాలమూరు ప్రజల సాక్షిగా చెబుతున్నా.. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పాలమూరుకు ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొస్తాం’. అని తెలిపారు.
బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు దగ్గర్లోనే ఉంది
బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకోవడం దగ్గర్లోనే ఉందని, ఈ రెండు పార్టీలు ఖానాపూర్, ఇబ్రహీంపట్నంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోత్తుతో పోటీ చేశాయని తెలిపారు. రెండు పార్టీలు కలిసి వచ్చినా కాంగ్రెస్కు నష్టం లేదని, ప్రజలు వారిని విశ్వసించే పరిస్థితి లేదన్నారు. 15 రోజుల్లో రాష్ట్ర స్థాయి నామినేటెడ్, కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు. కేసీఆర్కు విజన్, దూరదృష్టి లేదని, రూ. 1.20 లక్షల కోట్లతో కాళేశ్వరం కడితే అది కూలిపోయిందన్నారు. ఈ ప్రాజెక్టు గురించి కేటీఆర్ అమెరికాలో గొప్పులు చెప్పుకుంటుండని, ఆ ప్రాజెక్టు కూలింది మాత్రం చెప్పుకుంటలేడని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్రెడ్డి దూర దృష్టి ఉన్న నేతగా ఫోర్త్ సిటీని తీసుకొచ్చారన్నారు. మూడు రోజుల్లో5.78 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు హైదరాబాద్కు వచ్చాయన్నారు.
మోదీ ప్రధాని అయిన తర్వాత కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, ప్రాంతాల మధ్య పోరు పెడుతున్నారని విమర్శించారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ విప్, పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు
