ముంబై : బ్లూ జెట్ హెల్త్కేర్కు చెందిన మెయిన్బోర్డ్ ఐపీఓతోపాటు మరో నాలుగు ఎస్ఎంఈ ఇష్యూలు వచ్చే వారం పబ్లిక్ సబ్స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి వస్తాయి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి రూ. 938 కోట్ల వరకు సేకరించనున్నాయి. బ్లూ జెట్ హెల్త్కేర్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) సబ్స్క్రిప్షన్ అక్టోబర్ 25న అందుబాటులోకి వస్తుంది. అక్టోబర్ 27న ముగుస్తుంది. కంపెనీ ఈక్విటీ షేరు ప్రైస్బ్యాండ్ను రూ. 329–-346 మధ్య నిర్ణయించింది. ప్రైస్ బ్యాండ్ ఎగువన దాదాపు రూ.840 కోట్లను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది.
పెట్టుబడిదారులు కనిష్టంగా 43 ఈక్విటీ షేర్ల కోసం దరఖాస్తు చేయవచ్చు. ఆ తర్వాత మల్టిపుల్లాట్స్కు దరఖాస్తు చేయవచ్చు. ఈక్విటీ షేరుకు రూ. రెండు ముఖ విలువ కలిగిన పబ్లిక్ ఆఫర్లో ఓఎఫ్ఎస్ ద్వారానే పూర్తిగా 2.42 కోట్ల షేర్ల వరకు ఈక్విటీ షేర్లను అమ్ముతారు. ప్రమోటర్లు అక్షయ్ బన్సారిలాల్ అరోరా , శివన్ అక్షయ్ అరోరా షేర్లను అమ్ముతారు.
అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు 50 శాతం, రిటైల్ పెట్టుబడిదారులకు 35శాతం, సంస్థాగత పెట్టుబడిదారులకు15శాతం షేర్లను కేటాయిస్తారు. బ్లూ జెట్ హెల్త్కేర్ కాంట్రాక్ట్ కింద స్పెషాలిటీ ఫార్మాస్యూటికల్, హెల్త్కేర్ పదార్థాలు, ఇంటర్మీడియట్లను అభివృద్ధి చేస్తుంది. సరఫరా చేస్తుంది.
4 ఎస్ఎంఈ ఐపీఓలు
పారగాన్ ఫైన్, శాంతలా ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, మైత్రేయ మెడికేర్, ఆన్ డోర్ కాన్సెప్ట్లు వచ్చే వారం తమ పబ్లిక్ ఆఫర్లను ఎస్ఎంఈ విభాగంలో ప్రారంభించనున్నాయి. పారగాన్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ఇష్యూలో 51.66 లక్షల షేర్ల తాజా ఈక్విటీ ఉంది. దీని విలువ రూ. 51.66 కోట్ల వరకు ఉంటుంది. ఐపీఓ అక్టోబర్ 26–30 తేదీల్లో ఉంటుంది. శాంతలా ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ దాదాపు రూ.16 కోట్లు, ఆన్ డోర్ కాన్సెప్ట్స్ రూ.31 కోట్లను
పబ్లిక్ ఇష్యూల ద్వారా సమీకరించాలని చూస్తున్నాయి. శాంతలా పబ్లిక్ ఆఫర్ అక్టోబర్ 27న, ఆన్ డోర్ కాన్సెప్ట్స్ ఆఫర్అక్టోబర్ 23న ప్రారంభమవుతుంది. మైత్రేయ మెడికేర్ ఎస్ఎంఈ ఐపీఓ సైజు ఇంకా తెలియలేదు. ఇది 18.16 లక్షల షేర్లతో కూడిన పూర్తిగా తాజా ఈక్విటీ ఇష్యూ. ఈ పబ్లిక్ ఆఫర్ అక్టోబర్ 27న ప్రారంభమై నవంబర్ ఒకటో తేదీన ముగుస్తుంది.