ప్రముఖ నటుడు ఇన్నోసెంట్ కన్నుమూత

ప్రముఖ నటుడు ఇన్నోసెంట్ కన్నుమూత

ప్రముఖ మ‌ల‌యాళ క‌మెడియ‌న్‌, మాజీ ఎంపీ ఇన్నోసెంట్(75 ఏళ్లు) మార్చి 26 ఆదివారం క‌న్నుమూశాడు. ఆయన కోవిడ్ సంబంధిత స‌మ‌స్యల‌తో గతకొద్ది రోజులుగా ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఇన్నోసెంట్ మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇన్నోసెంట్ మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేశారు. ఇన్నోసెంట్‌కు 2012లో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మూడేళ్ల తర్వాత, అతను ఆ వ్యాధిని అధిగమించానని ప్రకటించారు. క్యాన్సర్‌తో తన యుద్ధం గురించి తన పుస్తకం ‘లాఫ్టర్ ఇన్ ది క్యాన్సర్ వార్డ్’లో రాశారు. 

నటుడు ఇన్నోసెంట్​ లోక్​ సభ ఎంపీగా కూడా సేవలందించారు. 2014 ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా చాళ‌కూడి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు. ఇక మ‌ల‌యాళ చిత్రసీమ‌లో దిగ్గజ హాస్యన‌టుల్లో ఒక‌రిగా ఇన్నోసెంట్ పేరుతెచ్చుకున్నారు. 1972లో సినీ రంగ ప్రవేశం చేసిన ఇన్నోసెంట్‌ 750కిపైగా సినిమాల్లో న‌టించాడు. మ‌జావిల్ కావ‌డి జాత‌కం, ప‌థం నిల‌యిలే తీవండి, రావ‌ణ‌ప్రభు, వేషం, స్నేహ‌వీడు, మ‌న‌సిన్నక్కరేతో పాటు ప‌లు మ‌ల‌యాళ సినిమాల్లో త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల‌కు వినోదాన్ని అందించారు. మ‌ల‌యాళంతో పాటు త‌మిళం, హిందీ సినిమాల్లో న‌టించారు ఇన్నోసెంట్‌. ఇంగ్లీష్ భాష‌లో కూడా ఓ సినిమా చేశాడు.

గ‌త ఏడాది క‌డువాతో పాటు నాలుగు సినిమాల్లో నటించారు ఇన్నోసెంట్‌. అత‌డు న‌టించిన‌ పాచువుమ్ అద్భుత‌విళ‌క్కుమ్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. న‌టుడిగానే కాకుండా ర‌చ‌యిత‌, ప్రొడ్యూస‌ర్‌గా, నేప‌థ్య గాయ‌కుడిగా రాణించి బ‌హుముఖ ప్రజ్ఞాశాలిగా మ‌ల‌యాళ చిత్రసీమ‌లో పేరుతెచ్చుకున్నారు ఇన్నోసెంట్‌. ఇన్నోసెంట్‌ మ‌ర‌ణంతో మ‌ల‌యాళ చిత్రసీమ‌లో విషాదం నెల‌కొంది.