- సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి.. పొలంబాట పట్టి..
ఎవుసం దండగని కంపెనీల్ల జాబులెతుక్కునేటోళ్లు ఇప్పుడెక్కువయిన్రు. సదువకున్నోళ్లు ఎవుసం జేస్తున్నరంటే కొలువు రాక, చేసేది లేక ఇట్ల బతుకుతున్నరనుకునే రోజులియ్యి. చేయనీకి రెక్కలు, తాతలిచ్చిన భూములున్న ఎవుసం వద్దు..ఉద్యోగమే ముద్దని కోచింగ్ సెంటర్లల్ల కుస్తీలు పట్టెటోళ్లే మోపైతున్నరు. లోకం ఇట్లుంటె, అయిదంకెల జీతం వదులుకోని ఎవుసం చేద్దమని పట్నం వదిలి పల్లెకొచ్చిండు మల్లికార్జున్!. మొదాల ఇబ్బందిపడ్డడు. దండుగలొచ్చినయ్. ఆ తర్వాత పంట చేలో పండగే! లాభాలేంది.. అవార్డులు గూడ వచ్చినయ్. ఇండియాకే ‘ఇన్నొవేటివ్ ఫార్మర్’ మన మల్లికార్జున్.
ఆరేళ్ల కింద.. పెద్ద కుర్మపల్లి (కరీంనగర్ జిల్లా, చొప్పదండి మండలం) చుట్టుముట్టు ఊళ్లల ‘మావురం మల్లికార్జున్ రెడ్డి తెలుసా?’ అంటే ‘ఆయనెవలో మాకేం ఎర్కని’ అనేటోళ్లు. అప్పుడా పిలగాడు సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఏదో కాలేజీలో సదివిండు. ఉద్యోగం చేయనీకి ఊరు దాటి పోయిండు. ఊరందరికీ తెలిసేంత ఏముంది. పక్క ఊరోళ్లకి ఇంకెట్ల తెలస్తది?
ఇప్పుడు.. ‘మావురం మల్లికార్జున్ మా ఊరోడే’నని పెద్ద కుర్మపల్లి జనమంత గొప్పగ చెప్పుకుంటున్నరు. ఆ పిలగాడు మా పక్క ఊరోడేనని చుట్టమట్టు ఊర్ల జనం గూడ చెప్పుకుంటున్నరు. సాఫ్ట్వేర్ కొలువు జేస్త పైసలు సంపాదిస్తడని కాదు. సాఫ్ట్వేర్ వదిలేసి, ఎవుసం చేసుకుంట ఊరికే కాదు తెలంగాణకే మంచి పేరు తెచ్చిండని చెప్పుకుంటున్నరు. ‘సదువుకున్నోడయితేనేం.. కష్టం జేయనీకి నామోషీ పడడు. ఎవుసం ఎట్ల లాభమొస్తదో అట్ల చేసిండు. అందరికీ నేర్పుతాండని చెప్పుకుంటన్నరు. 35 ఏళ్ల మల్లికార్జున్ కష్టం జూస్తే ఎన్ని మాటలు జెప్పినా ఒక్క ఆచరణకు సరితూగవనిపిస్తది.
ఇద్దరు ఒకటై చేయి కలిపితే..
సాఫ్ట్వేర్ ఇంజినీర్ మల్లికార్జున్ సిమాంటిక్ కంపెనీల 2003 నుంచి జాబ్ చేస్తన్నడు. సంధ్యారాణితో 2007ల పెండ్లి చేసినరు. ఆమె ఎంబీఏ చదివింది. ఆమె గూడ ఓ సాఫ్ట్వేర్ కంపెనీల జాబ్ చేస్తంది. ఇద్దరికీ అయిదంకెల జీతాలే! ‘ఆహా! ఏమి లైఫ్’ అనుకోలే వాళ్లు. ‘లైఫ్లో ఈ ఉరుకులు పరుగులు ఏంది? పొల్యూషన్, వర్క్ టెన్షన్, కల్తీ ఫుడ్.. అవసరమా?’ అనుకున్నరు. పైసల కోసం ఇన్నింటిని భరించొద్దని ప్రశాంతమైన లైఫ్, పొల్యూషన్లేని గాలి, కల్తీ లేని ఫుడ్, శ్రమ తప్ప స్ర్టెస్లేని అగ్రికల్చర్ బెస్ట్ అనుకున్నరు. ఇద్దరూ ఓ మాటమీదకొచ్చిన్రు. మల్లికార్జున్ వాళ్ల బాపు లక్ష్మారెడ్డికి ఈ ముచ్చట జెప్పిండు. ఒప్పించిండు. ఎవుసం చేయాల్నని 2014ల ఊరికి వచ్చిన్రు.
మావురం లక్ష్మారెడ్డి, మణెమ్మకు 12 ఎకరాల సాగు భూమి ఉన్నది. ఇంకో అయిదెకరాలు కౌలుకు తీస్కోని ఎవుసం మొదలువెట్టిండు. ఆర్గానిక్ పద్ధతిల ఎవుసం చేసిండు. డ్రిప్ ఇరిగేషన్తో చేస్తున్న ఆ ఎవుసం ఎలుకల దెబ్బకి దండగలపాలయింది. ఇట్ల కాదని రెండో పంటకి భూసార పరీక్ష జేయించిండు. అగ్రికల్చర్ సైంటిస్టుల్ని కలిసి ఆ భూమికి తగిన పంట, ఏ వంగడం అయితే బాగుంటదని తెలుసుకున్నడు. అట్ల రెండో పంటల ఏడు రకాల వరి వంగడాలని సాగుజేసిండు. ఆ ఊరి రైతులందరికంటే మల్లికార్జున పొలంలనే ఎక్కువ పంట పండింది. ఆరోజు వాళ్లింట పండగే!
పాత సాగు పద్ధతిలో కొత్త వంగడం
అప్పటి సంది మల్లికార్జున్ ఎవుసంల ఎనక్కి తిరిగి సూడలె. పట్టింది బంగారమన్నట్టు ఏది పండించిన లాభమొస్తుండె. చత్తీస్గఢ్ యూనివర్సిటీకి పోయి జింక్ రైస్ సాగు గురించి తెలుసుకోని వచ్చిండు. తన పొలంల దానిని సాగు జేసిండు. మల్లికార్జున్ ఇప్పుడు వరి, వసకొమ్ము (ఎకరంన్నర), అల్లం (10గుంటలు), మిర్చి (10గుంటలు), పల్లీ, పెసర, కొత్తిమీర, ఆకుకూరలు, పండ్ల చెట్లు, పప్పులు, పొద్దు తిరుగుడు సాగు చేస్తున్నడు. అయితే వీటిలో వసకొమ్ము సాగు మీద అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నరు. ఒకప్పుడు పసి పిల్లలకు మాటలు బాగా రావాలని వస పోసేది. ఆ వసలో ఇంకెన్నో మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నయి. వాటి మీద పరిశోధన చేస్తున్న ఆయుర్వేదిక్ యూనివర్సిటీతో కలిసి వసకొమ్ము సాగు చేస్తున్నడు. ఇది 9 నెలల పంట కాలం. దిగుబడి ఎకరానికి 25 క్వింటాళ్లు వస్తున్నదంట. ధర క్వింటా 9 వేల రూపాయలు. ఆస్తమా, టీబీ రోగులకు ఆయుర్వేద మెడిసిన్గా ఈ వసకొమ్మును వాడుతున్నరని, దీని సాగు తేలిక, లాభం కూడా ఎక్కువేనని మల్లికార్జున్ చెబుతున్నడు. వాణిజ్య పంటల్ని అందరిలెక్క ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా, సేంద్రియ ఎరువులు, సేంద్రియ పురుగు మందులతోనే సాగు చేస్తున్నానని, ఇట్లనే పెట్టుబడి తక్కువని మల్లికార్జున్ చెబుతున్నడు.
చేనుతో అనుబంధం
ఎవుసంతోపాటు వ్యవసాయ బావి, కుండీలలో చేపలు పెంచుతున్నడు. పశుపోషణ తనకు ఇంట్రెస్ట్ ఉంది. ఇంటికి దగ్గర్లనే ఒక షెడ్ వేసి, దేశీ ఆవులు, మేకలు, గొర్రెలు, కోళ్లు పెంచుతున్నడు. వాటి పేడ, పెంటని వేస్ట్ కాకుండా సేంద్రియ ఎరువుగా మారుస్తున్నడు. పశువుల కోసం పెంచి మిగిలిపోయిన గడ్డిని డీ కంపోస్ట్ చేయడం, అగ్రికల్చర్ వేస్ట్ని తగులబెట్టకుండా డీకంపోజ్ చేసి భూమి సారాన్ని పెంచుకునేందుకు సేంద్రియ ఎరువుగా వాడుతున్నడు.
సాగుబడి
తన అనుభవాలను అందరికీ చెప్పాల్నని అగ్రికల్చర్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మల్లికార్జున్ని ఎంకరేజ్ చేస్తున్నరు. సైంటిస్టులు మల్లికార్జున్ని జమ్మికుంట కృషి విజ్ఙాన కేంద్రం సలహాదారుగా నియమించినరు.
అందుల స్టడీ చేస్తున్న స్టూడెంట్స్కి సాగు పాఠాలు చెబుతనే, రైతులతో అనుభవాలు పంచుకుంటున్నడు. ఎట్ల చేస్తే లాభాలొస్తయో? ఎట్ల పట్టుబడి తగ్గించు కోవాల్నో రైతులుకు చెబుతున్నడు. మల్లికార్జున్ని ‘ఆత్మ’ విభాగంలో సభ్యుడిగా నియమించినరు. మల్లికార్జున్ ఇంకొంతమంది రైతులకు కొత్త దారి చూపిస్తే ఎవసం దండుగ కాదు. పండుగని ఊళ్లన్నీ అనుకునే రోజులొస్తయ్.
ప్రయోగాలతోనే మేలు
నాతోపాటే ఇంకెంతో మందిని సేంద్రియ పద్ధతిలోకి తీసుకొస్తున్న. వాళ్ల కష్టానికి తగ్గ లాభం వచ్చేట్టు చేస్తున్న. ఇట్ల చేస్తున్నందుకు నాకు సంతోషంగ ఉంది. నేను ప్రాక్టీస్ చేసే సాగు పద్ధతులు జూసి చానా మంది రైతులు మారినరు. ఇప్పుడు మా ఊళ్లనే 300 ఎకరాల్లో సేంద్రియ సాగు జరుగుతున్నది. నాకు ఎంతో గర్వంగా ఉన్నది. ‘సమీకృత వ్యవసాయం (ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్), కొత్త విధానాలను పాటిస్తేనే ఎవుసంల మంచి దిగుబడి వస్తది, మనకు లాభాలొస్తయ్.– మావురం మల్లికార్జున్ రెడ్డి
ఐడియాలకు అవార్డులు
అగ్రికల్చర్లో కొత్త ఐడియాలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, సమీకృత వ్యవసాయంతో ఎక్కువ లాభాలు సాధించే రైతుల్ని ఎంకరేజ్చేసేందుకు ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఎఆర్ఐ) ఏటా ‘ఇన్నొవేటివ్ ఫార్మర్’ అవార్డుని ఇస్తుంది. ‘ఇన్నొవేటివ్ ఫార్మర్ – 2021’కి తెలంగాణ స్టేట్ నుంచి మల్లికార్జున్ రెడ్డి సెలక్ట్ అయిండు. అట్లనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) ఏటా ఇచ్చే జగ్జీవన్రామ్ అభివన్ కిసాన్ పురస్కార్’ కి నామినేట్ అయిండు. ఈ ఆరేండ్ల కృషిలో మల్లికార్జున్ ఎన్నో అవార్డులు, సన్మానాలు అందుకున్నడు. జనవరి26న జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ రెడ్డికి ఉత్తమ రైతు అవార్డు అందించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, చత్తీస్గఢ్ యూనివర్శిటీ నుంచి ‘ఉత్తమ రైతు’ అవార్డులు అందుకున్నడు.
ఇవి కూడా చదవండి
మొక్కకు ఈ బాక్సు పెడితే.. నెలకు రెండు సార్లు నీళ్లు పోస్తే చాలు
చార్మినార్ ను డేంజర్లో పడేస్తున్నరు!
నాటినోళ్ల పేరే.. మొక్కకు పెడుతున్నరు