ఢిల్లీలో మాట్లాడదామన్న మోడీ
‘సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)ను పశ్చిమ బెంగాల్ప్రజలు వ్యతిరేకిస్తున్నరు. ఈ చట్టంతో పాటు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్నార్సీ), నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్)లను కూడా వద్దంటున్నరు. సీఏఏ అమలును ఆపి, చట్టాన్ని నెమ్మదిగా వెనక్కి తీసుకోండి’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీని కోరినట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. కోల్కతా పోర్ట్ ట్రస్ట్ 150 వ వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు రెండు రోజుల టూర్లో భాగంగా ప్రధాని మోడీ శనివారం కోల్కతా చేరుకున్నారు. రాజ్భవన్లో విడిది చేసిన ప్రధానిని మమతా బెనర్జీ కలిశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోడీ ఇప్పుడు మా అతిథి. ఇప్పుడిలా అడగడం కరెక్టో కాదో తెలియదు కానీ సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లను వెనక్కి తీసుకోవాలని ఆయనను కోరాం. ఇక్కడికి తాను వేరే పనులపై వచ్చానని, సీఏఏపై మాట్లాడేందుకు ఢిల్లీకి రమ్మని ప్రధాని కోరారు’ అని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయాన్ని ప్రధాని దగ్గర ప్రస్తావించినట్లు మమత పేర్కొన్నారు.
మీటింగ్ నుంచి నేరుగా ధర్నా వేదికకు..
ప్రధాని మోడీతో మీటింగ్ ముగిసిన తర్వాత మమతా బెనర్జీ నేరుగా సీఏఏ వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్నారు. రాజ్భవన్కు కొన్ని మీటర్ల దూరంలోనే ఉన్న రాణి రాష్మోణి రోడ్లో టీఎంసీ స్టూడెంట్స్ వింగ్నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో సీఏఏ నోటిఫికేషన్ కేవలం కాగితాలకే పరిమితమని, అమలు చేయబోమని మమత స్పష్టంచేశారు.