కోల్కతా: బెంగాల్ సంక్షేమం కోసం అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకోవడానికైనా తాను సిద్ధమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్ర ప్రజలకు తాను సెక్యూరిటీ గార్డుగా ఉంటానని, బెంగాల్ ప్రజలే తన తొలి ప్రాధాన్యత అని కామెంట్ చేశారు. యస్ తుఫాను ప్రభావంపై సమీక్షించేందుకు వచ్చిన ప్రధాని మోడీని అరగంట పాటు ఎదురుచూసేలా చేశానంటూ తనపై వస్తున్న విమర్శలను ఆమె కొట్టిపారేశారు. ఈ మేరకు ఆమె శనివారం వర్చువల్ ప్రెస్ మీట్లో మాట్లాడారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం గ్రూపు రాజకీయాలు చేస్తోందని, తన ఇమేజీని దెబ్బతీసేందుకు కావాలనే మీడియాకు తప్పుడు రిపోర్టు ఇస్తోందని మమత విమర్శించారు.
మోడీని వెయిట్ చేయించలే..
రాజకీయ లబ్ధికోసమే ప్రధాని మీటింగ్ ఏర్పాటు చేసి గవర్నర్ తో పాటు బెంగాల్ బీజేపీ నేతలను ఆహ్వానించారని మమత ఫైర్ అయ్యారు. తన కోసం ప్రధాని, గవర్నర్ అరగంట పాటు వెయిట్ చేశారనేది అబద్ధమని, తానే ఆయనకోసం 20 నిమిషాలు వెయిట్ చేశానని చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తూ తనను అవనిస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు.