- మైనారిటీలను రెచ్చగొడుతున్నారంటూ ఒవైసీపై ఆరోపణలు
- ఎంఐఎం బలం చూసి దీదీ భయపడుతోందంటూ అసద్ కౌంటర్
బీజేపీ దగ్గర డబ్బులు తీసుకుని.. మైనారిటీలను రెచ్చగొడుతున్నారంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. నేరుగా ఆయన పేరు చెప్పకుండా ఓ హైదరాబాదీ పార్టీ మత విద్వేషాలు రెచ్చగొడుతోందంటూ పరోక్షంగా ఆరోపణలు చేశారామె. బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న కూచ్ బెహర్లో నిన్న ఆమె సభ జరిగింది. ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ హిందువుల్లో లాగా మైనారిటీల్లో అతివాదం, రెచ్చగొట్టుడు ధోరణి పెరుగుతోందన్నారు. హైదరాబాద్కు చెందిన ఓ పొలిటికల్ పార్టీ బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని ఈ పని చేస్తోందని ఆరోపించారామె.
ఎంఐఎం బలం చూసి ఫ్రస్ట్రేషన్ అంటూ మమతకు ఒవైసీ కౌంటర్
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలు ఆమెలోని ఫ్రస్ట్రేషన్, భయాన్ని బయటపెట్టాయంటూ కౌంటర్ ఇచ్చారు ఎంఐఎం చీఫ్ ఒవైసీ. పశ్చిమ బెంగాల్లో ఎంఐఎం బలమైన శక్తిగా పుంజుకుంటోందని ఆమె తన కామెంట్స్తో ఆ రాష్ట్రంలోని ముస్లింలకు మెసేజ్ ఇచ్చారన్నారు. పార్టీ బలం పుంజుకుంటోందన్న భయంతోనే ఇలా మాట్లాడారని అన్నారు ఒవైసీ. ఒక వేళ తన పార్టీ చేస్తున్నది అతివాదమని దీదీ భావిస్తే తానే చేయలేనని చెప్పారాయన. పశ్చిమ బెంగాల్లోకి బీజేపీని ఎంటర్ అయ్యేలా చేయడం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్లో ఆ రాష్ట్ర ముస్లింలు వెనకబడిపోవడం లాంటివి మమత ఎక్ట్రీమిజం అని అన్నారు ఒవైసీ. పశ్చిమ బెంగాల్లో ఎంఐఎం బలపడాన్ని చూసి భయపడుతున్న మమతా బెనర్జీ.. గత ఎన్నికల్లో బెంగాల్లోని 42 ఎంపీ సీట్లలో 18 బీజేపీ ఎలా గెలవగలిగిందో చెప్పాలన్నారు.