- బెంగాల్ ఎన్నికల ర్యాలీలో బీజేపీ లీడర్లపై మమత ఫైర్
ఎగ్రా (వెస్ట్ బెంగాల్): ‘‘బీజేపీ మనకొద్దు. మోడీ మొఖం చూడొద్దు. మనకు అల్లరిమూకలు, దోపిడీదారులు, దుర్యోధనులు, దుశ్శాసనులు, మీర్ జాఫర్లు వద్దు..” అంటూ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో సహా బెంగాల్ బీజేపీ నేతలపై సీఎం, టీఎంసీ చీఫ్మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. శుక్రవారం ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని ఎగ్రా సిటీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. తృణమూల్ నుంచి బీజేపీలో చేరి, తనపైనే పోటీ చేస్తున్న సువేందు అధికారిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. సువేందును తాను గుడ్డిగా నమ్మితే ద్రోహం చేసి బీజేపీలో చేరారని, ఆయనను బెంగాల్ నవాబ్ మీర్ జాఫర్(ద్రోహి)తో పోల్చారు. మార్చి 27న ఖేలా హోబ్(ఆట స్టార్ట్ అవుతుంది). బీజేపీని ఔట్ చేయాలంటూ పిలుపునిచ్చారు. మమత ఆట ముగిసిపోతుందంటూ గురువారం ప్రధాని మోడీ చేసిన కామెంట్లను మమత తిప్పికొట్టారు. మోడీ తమ స్లోగన్ లను కాపీ చేస్తున్నారని, ఆయన ఒక కాపీక్యాట్ అని అన్నారు. వాళ్లు తన కాళ్లను గాయపర్చి ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకోవాలని చూశారని మమత ఆరోపించారు.
బీజేపీ నేతలు ఏడుస్తున్నరు..
బెంగాల్లో తృణమూల్ నుంచి బీజేపీలో చేరినవాళ్లకే ఆ పార్టీ టికెట్లు ఇచ్చిందని, దీంతో ముందు నుంచి పార్టీకి విధేయులుగా ఉన్న నేతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మమత అన్నారు. తృణమూల్ను వదిలి బీజేపీలో చేరినవాళ్లంతా ద్రోహులు అని, వాళ్లను వదిలించుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. బీజేపీ ఔట్ సైడర్స్ పార్టీ అని, అల్లర్లు, దోపిడీలు, హత్యలు చేస్తోందన్నారు. సీపీఎం, కాంగ్రెస్ పార్టీలకూ ఓటేయొద్దని, ఆ రెండు పార్టీలు బీజేపీకి దోస్తులేనని చెప్పారు. ఎన్నికల టైంలో ఈవీఎంల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పార్టీ కేడర్కు ఆమె సూచించారు.