- వీల్చైర్ పైనే మమత ప్రచారం
- నందిగ్రామ్లో 8 కిలోమీటర్ల మేర రోడ్ షో
కోల్కతా: రెండో విడత అసెంబ్లీ ఎన్నికల కోసం బెంగాల్ సీఎం, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ప్రచార వేగాన్ని పెంచారు. తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గంలో వీల్చైర్ పైనే ఆమె ప్రచారం చేపట్టారు. సోమవారం పార్టీ సీనియర్ నేతలతో కలిసి నందిగ్రామ్లో 8 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు చేతులు జోడించి అభివాదం చేశారు. వందల మంది స్థానికులు, తృణమూల్ కార్యకర్తలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. మమతా బెనర్జీ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పోలింగ్ ముగిసేవరకూ.. మమత నందిగ్రామ్ లోనే ఉంటారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నందిగ్రామ్లో గురువారం పోలింగ్ జరగనుండగా, మంగళవారం సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగియనుంది. మరోవైపు మంగళవారం నందిగ్రామ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారం చేస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.