![భార్య కాపురానికి రావడం లేదని విద్యుత్ స్తంభం ఎక్కిన భర్త](https://static.v6velugu.com/uploads/2024/04/man-climbed-high-voltage-pole-due-to-wife-not-coming-to-home_ASC0WVHX8v.jpg)
భార్యాభర్తలు అన్నాక చిన్నచిన్న అలకలు, మనస్పర్థలు రావడం సహజం. కొన్ని సంధర్భాల్లో మాటామాటా పెరిగి గొడవ కాస్త పెద్దదిగానూ అనిపించొచ్చు. ఆమాత్రం దానికే భార్యలు అలకబూని పుట్టింటికి వెళ్లడం, ఆమె తిరిగి మెట్టినింటికి రావడం లేదని భర్తలు విద్యుత్ స్తంభాలు ఎక్కడం కామన్ అయిపోయిది. ఇలానే ఓ భర్త పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి కాపురానికి రావడం లేదని 11 kv విద్యుత్ స్తంభం ఎక్కాడు. అలా ఎక్కడం అతనికిది రెండోసారి.
మెదక్ మండలం ఆవుసులపల్లికి చెందిన జైల్ సింగ్ భార్య.. కొన్నాళ్ల క్రితం అలకబూని పుట్టింటికి వెళ్ళింది. ఆమె తిరిగి మెట్టినింటికి రాకపోవడంతో మనస్తాపం చెందిన జైల్ సింగ్.. ఆవుసులపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న 11 kv విద్యుత్ స్తంభం ఎక్కాడు. పైన అజాగ్రత్తగా వ్యవహరించడంతో విద్యుత్ తీగలు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా శ్రమించి అతన్ని కిందకు దించిన స్థానికులు.. స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతను గతంలోనూ ఇలానే విద్యుత్ స్తంభం ఎక్కినట్లు స్థానికులు తెలిపారు.