ప్లేట్​ దోసె 2, ఇడ్లీ 3, ఊతప్పం 4 రూపాయలు

ప్లేట్​ దోసె 2, ఇడ్లీ 3, ఊతప్పం 4 రూపాయలు

దోసె రెండు రూపాయలకే ఇస్తరా ఎవరైనా? దోసెతో రెండు కుర్మాలు, రెండు  చట్నీలు, సాంబారు పెడతరా ఎక్కడైనా? చిన్నతంబి ఇస్తడు.. ఆకలితో నకనకలాడిన రోజుల్ని మర్చిపోకుండా.. తనకు చేతనైనంతలో ఆకలితో బాధపడుతున్నవాళ్ల కడుపునింపు తున్నడు ఈ చెన్నయ్​ కాకా. ఆ రుచులు, అక్కడి సంగతుల గురించి అడిగితే ఇట్ల చెప్పిండు.

‘‘మాది తమిళనాడులోని తిరుచ్చి సిటీ. అమ్మ అళగు, నాన్న సాత్యపన్​ నా చిన్నప్పుడే చనిపోయారు.  ఎనిమిదో తరగతి తర్వాత చదివే అవకాశం లేక, ఒక రెస్టారెంట్​​లో పని చేయడం మొదలుపెట్టాను. నాకు భార్య వెళ్లయమ్మాళ్​, ఇద్దరు పిల్లలున్నారు.  నేను పనిచేసిన రెస్టారెంట్​లో  అన్ని ఫుడ్​ ఐటమ్స్​ రేట్లు ఎక్కువగా ఉండేవి. దాంతో పేదవాళ్లు కడుపునిండా తినడం కుదిరేది కాదు.

పేదల కోసమే..
హోటల్​ ఇండస్ట్రీ గురించి నాకు బాగా తెలుసు. దాంతో  నేను కూడా ఓ చిన్న హోటల్​ పెట్టాలనుకున్నాను. ఎక్కువ రేట్లు పెట్టి లాభాలకు అమ్మితే డబ్బులు బాగానే వస్తాయి. కానీ.. నా ఉద్దేశం అది కాదు. పేదవాడు సగం ఆకలితో వెళ్లిపోకూడదన్నది నా ఆలోచన. చిన్నప్పుడు ఆకలితో ఎన్నో రాత్రులు నిద్ర పట్టేది కాదు. ఆ కష్టం నాకు తెలుసు. అలాగని నాలాగే బాధపడేవాళ్లకి పూర్తి ఉచితంగా తిండి ఎలాగూ పెట్టలేను.  అందుకని ఉన్నంతలో చిన్న హోటల్​ పెట్టి, తక్కువ రేటుకి పేదవాడి ఆకలి తీర్చాలి అని పించింది. అలా పుట్టిందే 2 రూపాయల దోసె.

అంతా నా కుటుంబమే
ఎలాగో తంటాలుపడి హోటల్​ పెట్టాను. ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో చిన్న షాప్​ తీసుకున్నాను.  రెండు రూపాయల దోసెలతో బిజినెస్​ స్టార్ట్​ చేశాను. జనం ఫుల్​గా కనెక్ట్​ అయ్యారు. ఇక్కడి​ వాళ్లే కాకుండా, నా రెండు రూపాయల కాన్సెప్ట్​కి మెచ్చి వేరే ప్రాంతాల నుంచి కూడా జనం వస్తున్నారు. స్కూల్​కి పోయే పిల్లలు కూడా వాళ్ల దగ్గర ఉన్న చిల్లర పైసలతో టిఫిన్​ చేస్తుంటారు. పది రూపాయలుంటే చాలు కడుపు నిండుతుంది. రెండు కుర్మాలు, రెండు చట్నీలు, ఒక కప్పు సాంబారు ఇస్తాం.

సాయంత్రం ఆరింటికి
ఉదయాన్నే కూరగాయలు, సరుకులు తెస్తా. వాటిని రెడీ చేయడానికే ఒక పూట పడుతుంది. పనంతా ఇంట్లోవాళ్లమే చేసుకుంటాం. సాయంత్రం 6 నుంచి నైట్​ 11.30  వరకు బిజినెస్​ అవుతుంది. ప్లేట్​ దోసె 2, ఇడ్లీ3, ఊతప్పం 4 రూపాయల చొప్పున అమ్ముతున్నాం. మరో 24 ఫుడ్​ ఐటమ్స్​ కూడా ఉన్నాయి. అన్నిట్లో దోసెకే గిరాకీ ఎక్కువ. 800  నుంచి వెయ్యి దోసెలు అమ్మిన రోజులున్నాయి.  లాక్​డౌన్​లో ఇబ్బంది పడ్డా, ఇప్పుడు బానే ఉంది.

పాపులర్​ అయింది
మా షాప్ చిన్న గల్లీలో ఉంటుంది ​. కుర్చీలు, బెంచీలు అంత రిచ్​గా ఉండవు. కానీ వచ్చే వాళ్లకు అవేమీ అక్కర్లేదు. కడుపునిండా తిని వెళ్తారు. ఇక్కడి పిలగాండ్లు యూట్యూబ్​లో  వీడియోలు తీసి పెట్టారు. మా హోటల్​ గురించి వార్తల్లో కూడా వచ్చింది.  ఇక  ఆ తర్వాత జనం తాకిడి ఎక్కువైంది. చాలామంది సెల్ఫీలు కూడా దిగుతుంటారు. ఇలా జనం ఎక్కువైనప్పుడు పనిచేసేందుకు  అసలు టైం సరిపోవట్లేదు. ఏదేమైనా..  అనుకున్నది చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
::: కుప్పిలి సుదర్శన్​