ములుగు : మేడారం మహాజాతరకు ఇవాళ అంకురార్పణ జరగనుంది. ఈ నెల 16 నుంచి నాలుగు రోజుల పాటు సాగే జాతరకు ప్రారంభంగా పూజరులు మండమెలిగే పండగ నిర్వహించనున్నారు. దీంతో మేడారం, కన్నెపల్లి గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. మండమెలిగే పండగ సందర్భంగా గుడిని, సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల గద్దెలు, అలంకరించి వన పూజారులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. వడ్డెలు మేడారం, కన్నెపల్లి గ్రామాలకు రక్షా బంధనం చేయనున్నారు.
మండమెలిగే పండుగ రోజు మేడారం, కన్నెపల్లిలో సమ్మక్క, సారలమ్మ గుడుల్లో అలుకుపూతలు చేసి ముగ్గులు వేస్తారు. రెండు గ్రామాలకు బూరక గుంజలతో ద్వార స్తంభాలు ఏర్పాటు చేసి రక్షా తోరణాలు కడతారు. గ్రామ దేవతలకు పూజలు చేసి జాతర ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేలా చూడాలని వేడుకుంటారు. రాత్రికి గద్దెల ప్రాంగణంలో జాగరణ చేసి.. మేకలను బలిచ్చి నైవేద్యం సమర్పిస్తారు.