- కర్నాటకలో హామీల అమలును కేసీఆర్, కేటీఆర్ చూడాలి
- వాళ్లకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి అక్కడికి తీసుకెళ్తామని వ్యాఖ్య
- డిక్లరేషన్లు, గ్యారంటీలకు మంచి స్పందన వస్తున్నది : ఠాక్రే
- గాంధీభవన్లో వార్ రూమ్, కనెక్ట్ సెంటర్ల ప్రారంభం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆ గ్యారంటీలను ప్రజలకు అందిస్తామని తెలిపారు. ‘‘కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్లను అమలు చేయరంటూ బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నరు. వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, చేవెళ్ల దళిత డిక్లరేషన్ సహా అన్నింటినీ అమలు చేసి తీరుతాం. వాటిని మేనిఫెస్టోలో పెడుతాం” అని స్పష్టం చేశారు.
బుధవారం గాంధీభవన్లోని ఇందిరా భవన్లో అభయహస్తం (ఆరు గ్యారంటీలు) వార్రూమ్, కనెక్ట్ సెంటర్లను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్రావ్ ఠాక్రే, మధుయాష్కీతో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం సగం మందికి పింఛన్లలో కోత విధించిందని, దాన్ని సామాజిక న్యాయం అనరని చెప్పారు.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి గ్యారంటీ కార్డులను ప్రజలకు అందజేయాలని భట్టి సూచించారు. వాటిని ఓ మూడు నెలల పాటు జాగ్రత్తగా దాచుకోవాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ గ్యారంటీ కార్డులను చూపించి హామీలను అమలు చేయించుకోవాలని ఆయన చెప్పారు.
కర్నాటకలో అమలైతున్నయో లేదో చూడండి
దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన అనుభవం కాంగ్రెస్ పార్టీకి ఉందని, గ్యారంటీలను అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళికలన్నీ తమకు తెలుసని భట్టి పేర్కొన్నారు. ఒకటికి రెండుసార్లు ఆలోచించి, అధ్యయనం చేసిన తర్వాతే గ్యారంటీలను ప్రకటించామన్నారు. ‘‘సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవితకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి కర్నాటకకు తీసుకెళ్తం. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో హామీలు అమలవుతున్నయో లేదో వాళ్లు చూడాలి” అని పేర్కొన్నారు. ఇంటికో ఉద్యోగం, దళిత సీఎం, కేజీ టు పీజీ ఉచిత విద్య, మూడెకరాల భూమి ఇస్తాం వంటి హామీలు ఇచ్చి మోసం చేసిన ఘనత కేసీఆర్దన్నారు.
కేసీఆర్లాగా మోసం చేయడం కాంగ్రెస్కు తెలియదన్నారు. రాహుల్ గాంధీపై అసదుద్దీన్ చేసిన కామెంట్లు బీజేపీకి ఉపయోగపడేలా ఉన్నా యని వ్యాఖ్యానించారు. రాహుల్ లౌకికవాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు దీపాదాస్ మున్షీ, మీనాక్ష నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్, పొన్నం, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.
వార్ రూమ్ ద్వారా కేడర్కు సూచనలిస్తం : ఠాక్రే
వార్రూమ్, కనెక్ట్ సెంటర్ ద్వారా కాంగ్రెస్ కేడర్కు క్షేత్రస్థాయిలో పనితీరుపై ఎప్పటికప్పుడు సూచన లిస్తామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్రావ్ ఠాక్రే తెలిపారు. ఎన్నికల టైంలో పార్టీకి ఇది చాలా ఉపయోగపడు తుందన్నారు. ఇప్పటికే డిక్లరేషన్లను, ఆరు గ్యారంటీలను ప్రకటిం చామని, వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని చెప్పారు. రాబో యే ఎన్నికల్లో కాంగ్రెస్సే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.