
న్యూఢిల్లీ: ఈ ఏడాది జులైలో భారత తయారీ రంగం వృద్ధి 16 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. హెచ్ఎస్బీసీ మాన్యుఫాక్చరింగ్ పర్చేంజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 59.1గా నమోదైంది. ఈ ఏడాది జూన్లో నమోదైన 58.4 నుంచి పెరిగింది. పీఎంఐ 50 పైన ఉంటే సంబంధిత సెక్టార్ విస్తరిస్తున్నట్టు. కొత్త ఆర్డర్లు, ప్రొడక్షన్ పెరిగాయని, డిమాండ్ 15 నెలల గరిష్టానికి చేరుకుందని హెచ్ఎస్బీసీ తెలిపింది. ఈ సంస్థ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ ప్రంజుల్ భండారీ మాట్లాడుతూ, మార్కెట్ ఆర్డర్లు దాదాపు ఐదేళ్లలో అత్యధిక వేగంతో పెరిగాయని అన్నారు.
‘‘అయితే, వచ్చే 12 నెలల్లో ఉత్పత్తి పెరుగుతుందన్న విశ్వాసం పడిపోయింది. పోటీ, ద్రవ్యోల్బణ ఆందోళనల కారణంగా ఇన్పుట్, ఔట్పుట్ ధరలు జులైలో ఎక్కువగా ఉన్నాయి. అల్యూమినియం, లెదర్, రబ్బర్, స్టీల్ ధరల పెరుగుదలతో ఇన్పుట్ ఖర్చులు జూన్ కంటే వేగంగా పెరిగాయి. అనుకూల డిమాండ్ కారణంగా కంపెనీలు ధరలను సర్దుబాటు చేశాయి. జులైలో నియామకాలు జరిగినా, ఎనిమిది నెలల్లో ఇదే తక్కువ” అని వివరించారు.