
ఇంకో రెండు రోజుల్లో బడ్జెట్. కరోనా సెకెండ్ వేవ్ నుంచి కోలుకుంటున్నామనే టైమ్లో థర్డ్ వేవ్ వచ్చిపడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి బడ్జెట్ తీసుకొస్తారనే ఆసక్తి పెరిగింది. కరోనా ముందు నుంచే కష్టాల్లో ఉన్న ఎకానమీని గట్టెక్కించడానికి ఈసారి ఏ సెక్టార్లకు ప్రాధాన్యం ఇస్తారో ఫిబ్రవరి 1 న తెలిసిపోతుంది. ఇప్పటికే చాలా సెక్టార్లు తమ కోరికల చిట్టాను ప్రభుత్వానికి అందించాయి. ఇక బంతి సీతారామన్ కోర్టులో ఉంది.
బిజినెస్ డెస్క్, వెలుగు: వివిధ సెక్టార్లు తమ విష్లిస్టును ఇప్పటికే ఫైనాన్స్ మినిస్ట్రీకి అందించాయి. అసలు ఏయే సెక్టార్లు బడ్జెట్ నుంచి ఏం కోరుకుంటున్నాయో చూద్దాం.
ఫార్మా ఇండస్ట్రీ..
కరోనా టైమ్లో దేశానికి సపోర్ట్ అందించిన సెక్టార్లలో ఫార్మా ముందుంటుంది. మన ఫార్మా ఇండస్ట్రీ మెరుగ్గా పనిచేయడంతో వ్యాక్సిన్ కోసం, ఇతర కరోన మెడిసిన్ల కోసం విదేశాలపై ఆధారపడడం తగ్గింది. తమకూ కొన్ని బడ్జెట్ కోరికలు ఉన్నాయని ఈ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కంపెనీలు తమ రెవెన్యూలో ఏడాదికి కనీసం 10 శాతమైనా ఆర్ అండ్ డీపై ఖర్చు చేస్తే ట్యాక్స్ రాయితీలను ఇవ్వాలని కోరుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల మాదిరే కంపెనీలు తెచ్చే ‘ఇన్నోవేషన్ బాండ్ల’ పై ట్యాక్స్ వేయొద్దంటున్నాయి. దీంతో ఆర్ అండ్ డీ ప్రాజెక్ట్లకు ఈజీగా ఫండింగ్ దొరుకుతుంది.
హెల్త్ కేర్ సెక్టార్..
హెల్త్ కేర్ సెక్టార్ కోసం చేస్తున్న కేటాయింపులు గత నాలుగేళ్లలో 8.9 శాతం పెరిగాయి. అయినప్పటికీ, బడ్జెట్లో ఈ సెక్టార్ కోసం చేసే కేటాయింపులు కేవలం 2.2 శాతంగానే ఉన్నాయని ఈ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయూష్మాన్ భారత్ , సీజీహెచ్ఎస్, ఈసీహెచ్ఎస్ వంటి స్కీమ్ల కింద ప్రైవేట్ కంపెనీలు అందించే సర్వీసుల ఫీజులను 60 రోజుల్లో తిరిగి చెల్లించేలా పాలసీ తేవాలని ఈ సెక్టార్ కోరుతోంది. అంతేకాకుండా ఈ స్కీమ్ల కింద చేస్తున్న ప్యాకేజి రేట్లను మరోసారి పరిశీలించాలని అపోలో ఎండీ సునీత రెడ్డి అన్నారు. దేశంలో ఫారినర్లకు అందించే హెల్త్ సర్వీస్లను ఎక్స్పోర్ట్స్ సర్వీస్లుగా చూడాలని ఆమె చెప్పారు. చాప్టర్ 6ఏ కింద ట్యాక్స్ డిడక్షన్లతో పాటు, ఇన్కమ్గా వచ్చే ఫారిన్ కరెన్సీని ట్యాక్స్ల నుంచి మినహాయించాలని అన్నారు. దీంతో దేశంలో మెడికల్ టూరిజం పెరుగుతుందని చెప్పారు.
ఎలక్ట్రిక్ వెహికల్స్..
ఎలక్ట్రిక్ వెహికల్స్ సెక్టార్కు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. రానున్న బడ్జెట్లో ఈ సెక్టార్ కోసం ఏం దాగి ఉన్నాయో? ఫిబ్రవరి 1 న తెలుస్తుంది. ఈవీ సెక్టార్ కూడా తమ కోరికల చిట్టాను బయటపెట్టింది. దేశంలో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ ఇండస్ట్రీ కోరుతోంది. రానున్న హౌసింగ్ ప్రాజెక్ట్లు, కమర్షియల్ ప్రాజెక్ట్లలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేయాలని ఏథర్ ఎనర్జీ కో–ఫౌండర్ తరుణ్ మెహతా అన్నారు. గ్లోబల్ చిప్ షార్టేజ్ వలన, పెరుగుతున్న ముడిసరుకుల ధరల వలన నష్టపోతున్న ఈవీ కంపెనీలకు మరికొన్ని ప్రోత్సాహకాలను అందించాలని ఈ ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి. ఈ సెక్టార్లోకి ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించేందుకు పాలసీలు మెరుగుపరచాలని ఆటో ఇండస్ట్రీ అడుగుతోంది. జీఎస్టీని తగ్గించాలని, ఇంపోర్ట్స్పై డ్యూటిని తగ్గించాలని కోరుతోంది.
మాన్యుఫాక్చరింగ్..
వచ్చే ఏడాది మార్చిలోపు దేశంలో ప్రొడక్షన్ స్టార్ట్ చేయగలిగే కొత్త మాన్యుఫాక్చరింగ్ కంపెనీలపై ఇన్కమ్ ట్యాక్స్ను 15 శాతానికి ప్రభుత్వం తగ్గించిన విషయం తెలిసిందే. కరోనా వలన చాలా కంపెనీలు తమ మాన్యుఫాక్చరింగ్ ప్లాన్స్ను చేరుకోలేకపోయాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ డెడ్లైన్ ఇంకో రెండేళ్లకు పొడిగించాలని కోరుతున్నాయి. పెరుగుతున్న రామెటీరియల్స్ కాస్ట్ను తట్టుకోవడానికి, సప్లయ్ చెయిన్ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సాయం అందించాలని మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ కోరుతోంది. గ్లోబల్ మార్కెట్లో పోటీ పడేందుకు మెరుగైన పాలసీలను తీసుకురావాలని మైక్రో, స్మాల్, మీడియం కంపెనీలు కోరుతున్నాయి.
రియల్ ఎస్టేట్..
తమకు ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వండని ప్రభుత్వాన్ని కోరుతోంది రియల్ ఎస్టేట్ సెక్టార్. హోమ్ లోన్లపై ప్రస్తుతం రూ. 2 లక్షల వరకు ఇస్తున్న ట్యాక్స్ రాయితీలను, రూ. 5 లక్షల కు పెంచాలని ఈ ఇండస్ట్రీ అడుగుతోంది. అంతేకాకుండా ‘అఫోర్డబుల్ హౌస్’ డెఫినిషన్ను మార్చాలని కోరుతోంది. ప్రస్తుతం మెట్రో సిటీలలో రూ. 45 లక్షల లోపు ఉన్న హౌసింగ్ యూనిట్లను అఫోర్డబుల్ హౌస్లుగా పిలుస్తున్నారు. దీన్ని మార్చాలని రియల్ ఎస్టేట్ సెక్టార్ కోరుతోంది. మెట్రో సిటీలలో ఈ లిమిట్ను రూ. 80 లక్షలకు, నాన్ మెట్రోసిటీలలో రూ. 50 లక్షలకు పెంచాలని రియల్ ఎస్టేట్ కంపెనీ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అతుల్ గోయల్ అన్నారు. మరోవైపు ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుండడంతో ప్రభుత్వం ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వాలని రియల్ సెక్టార్ అడుగుతోంది. జీఎస్టీని తగ్గించాలని, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను పొందేందుకు వీలు కలిపించాలని కోరుతోంది.
మిడిల్ క్లాస్కి ఏం కావాలి..
రానున్న బడ్జెట్లో హెల్త్, ఎడ్యుకేషన్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని మిడిల్ క్లాస్ కోరుతోంది. ఈటీ చేసిన సర్వేలో 40 శాతం మంది ఈ రెండు సెగ్మెంట్ల కోసం కేటాయింపులు పెంచాలని అన్నారు. దేశంలో పబ్లిక్ హెల్త్పై 2015–16 లో జీడీపీలో 0.9 శాతం వాటాను కేటాయించారు. అదే 2020–21 బడ్జెట్లో ఈ వాటాను 1.1 శాతానికి పెంచారు. అయినప్పటికీ, జీడీపీలో ఈ వాటా చాలా తక్కువగా ఉందని సర్వేలో పాల్గొన్న రెస్పాండెంట్లు అన్నారు. బడ్జెట్లో హెల్త్కేర్కు చేస్తున్న కేటాయింపుల్లో ఇండియా ర్యాంక్ 17 గా ఉందని (మొత్తం 189 దేశాల్లో) ఎకనామిక్ సర్వే 2020–21 పేర్కొన్న విషయం తెలిసిందే. 2025 నాటికి జీడీపీలో ఈ సెగ్మెంట్ కోసం 2.5 శాతం వాటాను కేటాయించాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా కావాలని మిడిల్ క్లాస్ అడుగుతోంది. బేసిక్ ట్యాక్స్ మినహాయింపును పెంచాలని, 80సీ కింద ట్యాక్స్ డిడక్షన్లను పెంచాలని కోరుతోంది. స్టాండర్డ్ ట్యాక్స్ డిడక్షన్ను తీసుకురావాలని అంటోంది. మరోవైపు జాబ్స్ పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతోంది.