
- ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపు.. అమెరికాతో వాణిజ్య చర్చలపై ఆశలు
- 25,100 పైన ముగింపు.. 25,500 దిశగా కదిలే అవకాశం
- ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని అంచనా
- అమెరికాతో వాణిజ్య చర్చలు తిరిగి మొదలయ్యే అవకాశం
ముంబై: ఇండియన్ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (సెప్టెంబర్ 12) సెషన్లోనూ లాభాల్లో కదిలాయి. నిఫ్టీ 50 వరుసగా ఎనిమిదో రోజూ పెరిగింది. అమెరికాలో జాబ్స్ డేటా బలహీనంగా రావడం, అక్కడి ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువగా పెరగడంతో ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలు బలపడ్డాయి. దీనికి తోడు అమెరికా–భారత్ వాణిజ్య సంబంధాలు మెరుగయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ బలపడింది.
సెన్సెక్స్ శుక్రవారం (సెప్టెంబర్ 12) 356 పాయింట్లు (0.44శాతం) పెరిగి 81,904.70 వద్ద ముగిసింది. నిఫ్టీ 109 పాయింట్లు (0.43శాతం) పెరిగి 25,114 వద్ద సెటిలయ్యింది. సెన్సెక్స్ కంపెనీల్లో భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకీ, టాటా మోటార్స్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి.
ఇన్ఫోసిస్ రూ.18 వేల కోట్ల షేర్ బైబ్యాక్ ప్రకటించడంతో ఈ కంపెనీ షేర్లు ఒక శాతం లాభపడ్డాయి. ఆటో షేర్లలో టాటా మోటార్స్, మారుతి లాభాల్లో ముగిశాయి. మరోవైపు ఎటర్నల్, విప్రో, హిందుస్తాన్ యూనిలీవర్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ట్రెంట్, బజాజ్ ఆటో షేర్లు శుక్రవారం నష్టపోయాయి.
ఫెడ్ రేట్ల కోత!
ఈ నెల 16–17 న జరిగే సమావేశంలో ఫెడ్ వడ్డీ రేట్లను 0.25శాతం తగ్గించే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరికి మరో రెండు తగ్గింపులు ఉండొచ్చని అంచనా. అమెరికా వడ్డీ రేట్లు తగ్గితే డాలర్ బలహీనపడి, భారత మార్కెట్లకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇండియన్ మార్కెట్లు పాజిటివ్గా కదలడానికి ఇదొక కారణం. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ మాట్లాడుతూ, “ఫెడ్ రేట్లు తగ్గించే అంచనాలు, అమెరికా–భారత్ వాణిజ్య చర్చలు మార్కెట్కి బలాన్నిచ్చాయి. రష్యా ఆయిల్ కొనుగోలుపై అమెరికా టారిఫ్ ప్రతిపాదనలను ఈయూ తిరస్కరించొచ్చన్న వార్తలు కూడా మార్కెట్ మూడ్ను మెరుగుపరిచాయి” అని అన్నారు.
రానున్న సెషన్లలోనూ లాభాల్లోనే?
నిఫ్టీ తాజాగా 25,100 రెసిస్టెన్స్ను దాటింది. 25,500 వైపు కదులుతోంది. డైలీ చార్ట్లో ఎంఏసీడీలో బై సిగ్నల్ కనిపిస్తోందని ఎనలిస్టులు పేర్కొన్నారు. మరోవైపు 50-డే మూవింగ్ యావరేజ్ వద్ద (24,900) మద్దతు లభిస్తుందని అన్నారు. “తాజా ర్యాలీ తర్వాత కొంత లాభాల స్వీకరణ జరగొచ్చు. కానీ మార్కెట్ పడినప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమం” అని సెంట్రమ్ బ్రోకింగ్ ఎనలిస్ట్ నీలేష్ జైన్ అన్నారు.
గ్లోబల్ మార్కెట్లు చూస్తే, ఫెడ్ రేట్ల తగ్గింపు అంచనాలతో ప్రపంచ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో కదిలాయి. ఏఐ ఆదాయ అంచనాలపై చైనా మార్కెట్లు 3.5 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. బంగారం 0.3శాతం పెరిగి ఔన్స్కు 3,644 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ వారం 3,673.95 వద్ద రికార్డు స్థాయిని తాకింది. డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం 7 పైసలు బలపడి 88.28 వద్ద ముగిసింది. మరోవైపు డాలర్ ఇండెక్స్ 0.2శాతం పెరిగి 97.76కి చేరింది. క్రూడ్ ఆయిల్ బ్రెంట్ ధర బ్యారెల్కు 66.79 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది.