 
                                    - 593 పాయింట్లు పడ్డ సెన్సెక్స్
- షేర్లను అమ్మేస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు
- ప్రాఫిట్ బుకింగ్కు ఇన్వెస్టర్ల మొగ్గు
ముంబై: యూఎస్ ఫెడ్ ఈ ఏడాది డిసెంబర్లో రేట్ల కోత ఉండదని స్పష్టం చేయడంతో ఇండియన్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడయ్యాయి. ఊహించినట్టుగానే తాజాగా 25 బేసిస్ పాయింట్ల కోత పెట్టిన ఫెడ్, ఈ ఏడాది చివరిలోపు మరోసారి రేట్లు తగ్గిస్తుందని ఇన్వెస్టర్లు భావించారు. మరోవైపు ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో బెంచ్మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ గురువారం 593 పాయింట్లు (0.70శాతం) పడి 84,404.46 వద్ద ముగిసింది.
ఇంట్రాడేలో ఇది 684.48 పాయింట్లు పతనమై 84,312.65 లెవెల్ని తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 176.05 పాయింట్లు (0.68శాతం) తగ్గి 25,877.85 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో 2,291 షేర్లు పడిపోగా, 1,876 షేర్లు లాభపడ్డాయి. 155 షేర్లలో మార్పు లేదు. సెన్సెక్స్ కంపెనీల్లో భారతి ఎయిర్టెల్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువగా నష్టపోయాయి. లార్సన్ అండ్ టూబ్రో, భారత్ ఎలక్ట్రానిక్స్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి లాభపడిన కంపెనీల్లో ఉన్నాయి.
ఎనలిస్టులు ఏమంటున్నారంటే?
‘‘ఫెడ్ 25 బేసిస్ పాయింట్ల వడ్డీ తగ్గింపు ప్రకటించినా, చైర్మన్ జెరోమ్ పావెల్ భవిష్యత్లో రేట్ల కోత ఉండకపోవచ్చని సంకేతాలు ఇవ్వడంతో ఇన్వెస్టర్ల మూడ్ దెబ్బతింది. అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ పరిస్థితులు కూడా మార్కెట్పై ప్రభావం చూపించాయి”అని లెమొన్ మార్కెట్స్ ఎనలిస్ట్ గౌరవ్ గార్గ్ అన్నారు. ఇది 2025లో చివరి వడ్డీ తగ్గింపు కావచ్చన్న సంకేతాలు ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ను దెబ్బతీశాయని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ పేర్కొన్నారు.
డాలర్ బలపడటంతో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు పడ్డాయని చెప్పారు. మెహతా ఈక్విటీస్ ఎనలిస్ట్ ప్రశాంత్ టాప్సే ప్రకారం, యూరోప్, ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాలు, ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలతో లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) గురువారం రూ.3 వేల షేర్లను అమ్మారు.
టెలికం, టెక్, బ్యాంక్ షేర్లలో అమ్మకాలు..
బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ గురువారం 0.06శాతం తగ్గగా, మిడ్క్యాప్ ఫ్లాట్గా ముగిసింది. టెలికం (2.52శాతం), టెక్ (1.02శాతం), బ్యాంకెక్స్ (0.72శాతం), ఫైనాన్షియల్ సర్వీసెస్ (0.59శాతం), ఫోకస్డ్ ఐటీ (0.55శాతం) ఇండెక్స్లు ఎక్కువగా నష్టపోయాయి. ఎనర్జీ, ఇండస్ట్రియల్స్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ ఇండెక్స్లు లాభపడ్డాయి.
ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు నష్టపోయాయి. కొరియా కోస్పీ, జపాన్ నిక్కీ సూచికలు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.59శాతం తగ్గి బ్యారెల్కు 64.54 డాలర్లకి చేరింది. కాగా, గత సెషన్లో సెన్సెక్స్ 368.97 పాయింట్లు (0.44శాతం) పెరిగి 84,997.13 వద్ద, నిఫ్టీ 117.70 పాయింట్లు (0.45శాతం) పెరిగి 26,053.90 వద్ద ముగిశాయి.

 
         
                     
                     
                    