
పుల్వామాలో CRPF కాన్వాయ్ పై దాడి జరిపేందుకు పాకిస్తాన్ ఆర్మీ హాస్పిటల్ నుండి ఆదేశాలు వచ్చాయి. అనారోగ్య కారణాలతో పాక్ ఆర్మీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ నాలుగు నెలల క్రితమే దాడికి ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. గత ఏడాది అతని మేనల్లుడు ఉస్మాన్ ను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇందుకు ప్రతీకార చర్యగా పుల్వామా దాడికి పూనుకున్నాడు మసూద్. యుద్దంలో చనిపోవడం కంటే గొప్పవిషయం ఉండదని.. అందుకు సిద్ధంగా ఉండాలనే…మెసేజ్ ను కశ్మీర్ లోయలో ట్రైనింగ్ తీసుకుంటున్న జిహాదీలకు పంపించాడు. ఇందుకు తగినట్టుగా జిహాదీలను రెడీ చేయాలని.. ఆత్మాహుతి దాడి చేసుకునేందుకు ప్రేరేపించాలని జైషే మాజీ కమాండర్ అబ్దుల్ రషీద్ కు సమాచారాన్ని అందజేశాడు.
ప్లాన్ ను రహస్యంగా అమలు చేశారు..
భారత్ లో దాడులు నిర్వహించేందుకు United jihad council (UJC) అనే గ్రూప్ ఉంది. ఇందులో పలు ఉగ్ర సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ భారత్ లో దాడులకు పాల్పడేందుకు ప్రణాళికలు వేస్తాయి. భారత్ లో ఎక్కడ దాడి జరపాలన్నా గ్రూప్ సభ్యులందరూ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్లాన్ చేస్తారు. అయితే పుల్వామా దాడి మాత్రం గ్రూప్ సభ్యులకు వివరించకుండా.. అత్యంత రహస్యంగా ప్లాన్ చేశారు జైషే ఉగ్రవాదులు.
ఈ ఉగ్ర ఘటనలో 40మంది CRPF జవాన్లు అమరులయ్యరు. దేశ వ్యాప్తంగా అమరుల బలిదానాలకు నివాళులు అర్పించారు దేశ ప్రజలు. విదేశాలలో ఉన్న భారతీయులు కూడా ఆయా దేశాలలో ఉన్న పాక్ హై కమిషనర్ ఎదుట ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. లండన్ లో ఏకంగా 1000 మంది NRI లు పాక్ హై కమిషన్ ఎదుట నిరసన చేపట్టారు.