
- 46 మంది ఈఈలకు ఎస్ఈలుగా.. 123 మంది ఏఈఈలకు
- డీఈఈలుగా పదోన్నతులు
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ శాఖలో ప్రభుత్వం భారీగా ప్రమోషన్లను కల్పించింది. తెలంగాణ వచ్చాక ఎన్నడూ లేనివిధంగా 179 మంది అధికారులకు పదోన్నతులు ఇచ్చింది. వాస్తవానికి ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడే 33 ఏండ్లుగా అధికారులు ప్రమోషన్లు లేకుండానే పనిచేస్తున్నారు. తాజాగా డిపార్ట్మెంట్ను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రమోషన్ల ప్రక్రియపై దృష్టి సారించింది. అందులో భాగంగానే డిపార్ట్మెంటల్ప్రమోషన్ కమిటీ (డీపీసీ)లను క్లియర్ చేస్తూ ప్రమోషన్లను ఇస్తున్నది. రెండ్రోజుల క్రితం 8 మంది ఎస్ఈలకు సీఈలుగా ప్రమోషన్ ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వగా.. తాజగా 46 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు (ఈఈ) సూపరింటెండెంట్ ఇంజనీర్లుగా (ఎస్ఈ), 123 మంది ఏఈఈలకు డీఈఈలుగా పదోన్నతులు కల్పించింది.
ఈ మేరకు శుక్రవారం ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులిచ్చారు. ప్రమోషన్లు పొందిన అధికారులు 15 రోజుల్లోగా రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కాగా, 2008 బ్యాచ్కు చెందిన 127 మంది ఏఈఈలకు వివిధ కారణాలతో 17 ఏండ్లుగా ప్రమోషన్లు దక్కలేదు. దీంతో ప్రమోషన్ల కోసం ఏఈఈలు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. 127 మందిలో 123 మందికి ప్రమోషన్ఆర్డర్లను రిలీజ్ చేసింది. కోర్టు కేసుల కారణంగా మిగతా నలుగురి ప్రమోషన్లను ప్రభుత్వం హోల్డ్లో పెట్టినట్టు తెలిసింది. ఇప్పటివరకు ఇద్దరికి ఈఎన్సీలుగా, 8 మందికి సీఈలుగా, 46 మందికి ఎస్ఈలుగా, 123 మందికి డీఈఈలుగా ప్రమోషన్లు రాగా.. మొత్తంగా 179 మందికి సర్కారు ప్రమోషన్లు ఇవ్వడం విశేషం.
గతంలో అందని ద్రాక్షగా ప్రమోషన్లు..
గతంలో ప్రమోషన్లు అందని ద్రాక్షగానే ఉండేదని అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్, హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సభ్యులు అన్నారు. పదోన్నతి పొందడంలో అడుగడుగునా జీఓలు, జోనల్ వ్యవస్థలు సవాళ్లుగా ఉండేవన్నారు. 17 ఏండ్లుగా డ్యూటీ చేస్తున్నా.. 2008 బ్యాచ్ ఏఈఈలకు ప్రమోషన్లు రాలేదని, కానీ, ప్రజాప్రభుత్వం జీఓలను సవరిస్తూ, జోనల్ వ్యవస్థలను సరిచేస్తూ ప్రమోషన్లు ఇచ్చిందని తెలిపారు. అన్నేండ్ల కలను కాంగ్రెస్సర్కారు నిజం చేసిందన్నారు. డీఈఈలుగా ప్రమోషన్ పొందిన ఏఈఈలు మేఘావత్ శ్రీనివాస్, శివకుమార్, శ్రీనివాస్ నాయక్, కిరణ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.