RCB విజయోత్సవ ర్యాలీలో విషాదం.. బెంగళూరులో తొక్కిసలాట.. ఇద్దరు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం

RCB విజయోత్సవ ర్యాలీలో విషాదం.. బెంగళూరులో తొక్కిసలాట.. ఇద్దరు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం

బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవ ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. చిన స్వామి స్టేడియానికి ఆర్సీబీ అభిమానులు పోటెత్తారు. అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ క్రమంలో.. వేల సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు లాఠీ దెబ్బల నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీశారు. పెద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 18 ఏళ్ల టీనేజర్ చనిపోయాడు. మరొకరు కూడా ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

తొక్కిసలాటలో ఊపిరాడక 15 మంది అస్వస్థతకు లోనయ్యారు. 18, 19, 20వ నంబర్ గేట్లు ఓపెన్ చేయడంతో అభిమానులు దూసుకొచ్చారు. అక్కడి నుంచి ఆర్సీబీ టీం స్టేడియంలోకి వస్తున్నారని తెలిసి.. 12వ నెంబర్ గేట్ దగ్గరకు అభిమానులు పరిగెత్తుకుంటూ వెళ్లారు. భారీ తొక్కిసలాట జరిగింది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

ఆర్సీబీ టీంకు చిన స్వామి స్టేడియంలో సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య సత్కార కార్యక్రమం ఉందని.. అందువల్ల.. విధానసౌధ, చినస్వామి స్టేడియం సమీపంలోని రోడ్లపైకి సాయంత్రం 3 నుంచి 8 గంటల మధ్యలో రాకుండా ఉండాలని బెంగళూరు పబ్లిక్కు ట్రాఫిక్ పోలీసులు సూచించారు. 

అయినప్పటికీ ఆర్సీబీ విజయంలో పాలు పంచుకునేందుకు అభిమానులు పెద్ద ఎత్తున చినస్వామి స్టేడియానికి పోటెత్తారు. పరిమిత సంఖ్యలో పాసులు ఇవ్వడం, పాసులతో సంబంధం లేకుండా స్టేడియంలోకి అభిమానులు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట జరిగింది.