
- కేర్ టేకర్ పై కుటుంబ సభ్యుల అనుమానం, అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్ కాలనీలో సోమవారం భారీ చోరీ జరిగింది. ఓ వృద్ధురాలి ఇంట్లో నుంచి 40 తులాల బంగారు బిస్కెట్లు, రూ.8 లక్షల నగదు మాయమయ్యాయి. ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లో ఈ చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపింది. ఈ చోరీ వెనుక వృద్ధురాలి దగ్గర కేర్ టేకర్గా పని చేస్తున్న కరీమా బేగంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మూడు నెలలుగా కేర్ టేకర్ గా పని చేస్తున్న మహిళపై అనుమానాలు ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సూర్యాపేట టౌన్ పోలీసులు అనుమానితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో పోలీసులు ఇంట్లో, పరిసర ప్రాంతాల్లోనూ ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటయ్య తెలిపారు.