ఇంగ్లిష్ లో కోర్సును 45 కాలేజీలకే
పరిమితం చేస్తూ ఆదేశాలు
డ్రాగన్ కంట్రీలో మన ఎంబీబీఎస్
స్టూడెంట్లు 21 వేలు
బీజింగ్: ఎంబీబీఎస్ విద్యపై చైనా ఆంక్షలు విధించింది. అక్కడ ఇంతకుముందు 200 కాలేజీల్లో ఇంగ్లిష్లో కోర్సు నడుస్తుండగా ఇప్పుడా సంఖ్యను కేవలం 45కు తగ్గించేసింది. మెడిసిన్ చేయడానికి ఇండియా సహా ఇతర దేశాల నుంచి ఏటా వస్తున్న స్టూడెంట్ల సంఖ్య పెరుగుతున్నా అతి తక్కువ కాలేజీలకే ఇంగ్లిష్ ఎంబీబీఎస్ను పరిమితం చేసింది. మిగతా కాలేజీల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లిష్ పాఠాలంటూ విదేశీ స్టూడెంట్లను చేర్చుకోవద్దని అక్కడి విద్యా శాఖ ఆదేశాలిచ్చింది. అయితే ఏయే వర్సిటీల్లో ఏయే లాంగ్వేజ్లలో ఎంబీబీఎస్ చెబుతారో మాత్రం వెల్లడించలేదు. చైనా నిర్ణయంతో ఇంతకుముందు ఇంగ్లిష్లో పాఠాలు వింటున్న స్టూడెంట్లు కోర్సు పూర్తి చేయడానికి చైనీస్ భాష మాండరిన్ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
మనోళ్లు 23 వేల మంది..
అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో పోలిస్తే చైనాలో తక్కువకే ఎంబీబీఎస్ అయిపోతుండటంతో చాలా మంది ఇండియన్, ఇతర ఆసియా దేశాల స్టూడెంట్లు డ్రాగన్ కంట్రీకి వెళ్తుంటారు. ప్రస్తుతం చైనా వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది విదేశీ స్టూడెంట్లు చదువుతుండగా మనోళ్లు 23 వేల మంది వరకు ఉన్నారు. పాక్ స్టూడెంట్లు 28 వేల మంది చదువుకుంటున్నారు. మన 23 వేల మంది స్టూడెంట్లలో 21 వేల మంది ఎంబీబీఎస్లోనే జాయిన్ అయ్యారు. ఇండియా నుంచి చైనాకు ఎంబీబీఎస్కు వెళ్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతుండటంతో చైనా విద్యా శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని మన ఎంబసీ సోమవారం తెలిపింది. ఎంబీబీఎస్ కోర్సు చెప్పని 200లకు పైగా కాలేజీల లిస్టును త్వరలోనే ఎంబసీ వెబ్సైట్ నుంచి తొలగిస్తామని పేర్కొంది.