
భద్రాచలం, వెలుగు : గిరిజన గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అన్ని రకాల వ్యాధి నిర్ధారణ టెస్టులు చేయాలని మినిస్టరీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ రాజీ ఆదేశించారు. మినిస్టరీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసు నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె రివ్యూ చేశారు. గిరిజనులు ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా చేస్తున్న యాక్షన్ ప్లాన్పై ఆమె సమీక్షించారు. తలసేమియా, సికిల్సెల్ లాంటివి వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ సోకుతున్నాయన్నారు. గిరిజన గ్రామాల్లో రక్తపరీక్షలు చేయాలన్నారు.
దీనిపై వారికి అవగాహన కల్పించాలన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని వైద్యశాలల్లో డాక్టర్ల కొరత, గైనకాలజిస్టులు, ఫిజియోథెరపీ మిషన్లు, స్కానర్, ఎక్స్ రే, డిజిటల్ సిటీ స్కాన్ కొరత ఉందని ఏపీవో జనరల్ డేవిడ్రాజ్ డిప్యూటీ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కాన్ఫరెన్స్ లో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రామకృష్ణ, ప్రోగ్రాం ఆఫీసర్ రాము తదితరులు పాల్గొన్నారు.