
- కుంగిన 7వ బ్లాక్ వద్ద భూఅంతర్భాగంలో షీట్ ఫైల్స్
- మూడు షిఫ్టుల్లో కొనసాగుతున్న పనులు.. రిపేర్ల కోసం భారీ మెషీన్ల వినియోగం
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ దగ్గర రిపేర్ వర్క్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. వచ్చే వర్షాకాలం నాటికి రిపేర్లు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ సంస్థ పనులు చేస్తున్నది. కుంగిన ఏడో బ్లాక్ వద్ద షీట్ ఫైల్స్ వేయడం, గేట్ల తొలగింపు, సీసీ బ్లాక్ల నిర్మాణం వంటి పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి. పిల్లర్ల సమీపంలో పడిన భారీ బొయ్యారాలను పూడ్చివేయడానికి గ్రౌటింగ్ చేపడుతున్నారు.
భారీ మెషీన్లతో పాటు కార్మికులంతా మూడు షిప్ట్లుగా శ్రమిస్తున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఆదేశాల మేరకు మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్ దగ్గర ఎల్ అండ్ టీ కాంట్రాక్ట్ సంస్థ షీట్ ఫైల్స్ వేస్తున్నది. పియర్స్(పిల్లర్లు)కు కొద్ది దూరంలో సీసీ బ్లాక్లను ఆనుకొని భూ అంతర్భాగంలోకి వీటిని దించుతున్నారు. బ్యారేజీ నిర్మాణ సమయంలో భారీ ఖర్చుతో సీకెంట్ ఫైల్స్ వేశారు. అయినా బ్యారేజీ కుంగకుండా ఇవి ఆపలేకపోయాయి. సీకెంట్ ఫైల్స్ దెబ్బతినడం వల్లనే బ్లాక్ 7 లోని మూడు పియర్స్ భూమిలోకి కుంగిపోయాయి.
నిరంతరాయంగా పనులు
మేడిగడ్డ బ్యారేజీ దగ్గర రిపేర్ వర్క్స్ కోసం కార్మికులు మూడు షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు. భారీ యంత్రాల సాయంతో వందలి మంది కార్మికులు వర్క్స్ చేస్తున్నారు. బ్యారేజీలో కుంగిన ఏడో బ్లాక్ లోని గేట్లను తొలిగించడం సవాల్గా మారింది. మొత్తం 86 గేట్లలో 80 గేట్లను ఎత్తి ఉంచారు. . కుంగిన ఏడో బ్లాక్ లోని 15 నుంచి 21వ నంబర్ వరకు గల 6 గేట్లు తొలగించడం చాలా కష్టంగా మారింది.
ఇనుప నిచ్చెనల సహాయంతో కటింగ్ మిషన్ల ఆధారంగా గేట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. బ్యారేజ్ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ లలో కొట్టుకుపోయిన సీసీ బ్లాక్ లను పునర్నిర్మిస్తున్నారు. పియర్స్ కింద నుంచి లీకేజీ అయ్యి వస్తున్న నీటిని మోటర్లతో ఖాళీ చేస్తున్నారు. డౌన్ స్ట్రీమ్ లో ఏర్పడిన ఇసుక మేటలను జేసీబీలతో తొలిగిస్తున్నారు. బ్యారేజీ కుంగిన పియర్ల అప్ స్ట్రీమ్ లో పియర్లు, సీసీబ్లాక్ ల మధ్య కుంగి ఏర్పడిన ఖాళీ ప్రాంతాలను ఇసుక సంచులు వేసి రిపేర్లు చేస్తున్నారు. మహారాష్ట్ర వైపు నుంచి ఏడవ బ్లాక్ వరకు నీళ్లు రాకుండా మట్టికట్టను పోసి గ్రౌటింగ్ పనులు కూడా చేపట్టారు.